అనంతపురం: మతాల పేరుతో ఓట్లు అడిగిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రతిపక్షాలను మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. సోమవారం జిల్లాలో జగనన్న ఇంటి పట్టా దారుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వసతులతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధితో ప్రభుత్వం ముందుకెళ్తుంటే.. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ప్రజా సంక్షేమానికి గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు.
విగ్రహాలను కొంతమంది రాజకీయ పార్టీల ముసుగులో ఎత్తుకు వెళ్తు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా చేస్తున్నారని ఆక్షేపించారు. మతాల పేరుతో ఓట్లు అడిగిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. ఒకటి రెండు పత్రికలను అడ్డుపెట్టుకుని ఇలా చేస్తున్నారని దుయ్యబ్టారు. రాష్ట్రంలో ఎలాంటి సంఘటన జరిగిన దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు. దేనికి భయపడేది లేదని .ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్ ప్రజా సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మరని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు.