విశాఖపట్నం: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు ఈ సారి ఆయన ప్రయత్నం మిస్ ఫైర్ అయ్యిందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతిపరుడని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. పేదల కోసం నిర్మించే ఇళ్లలో కూడా అవినీతికి పాల్పడ్డాడు. ఐటీ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై చంద్రబాబు, లోకేష్ ఏం సమాధానం చెబుతారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బాబు పర్సనల్ సెక్రటరీ దగ్గరే రూ.2 వేల కోట్ల అక్రమాస్తులు దొరికాయంటే.. చంద్రబాబు, లోకేష్లను విచారిస్తే ఆ రూ.2 వేల కోట్లకు ఇంకెన్ని సున్నాలు చేరనున్నాయో..? అని అనుమానం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అవినీతిపై సమగ్ర విచారణ జరగాలి. చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవడానికి మీడియా ముందుకు వచ్చి సమగ్ర విచారణ కోరాలి. కడిగిన ముత్యం అని చెప్పుకునే లోకేష్.. బయటకు రావాలి.. విచారణ జరిగితే ముత్యమో.. మసిబొగ్గో తెలుస్తుంది. పేదవాడి పొట్టకొట్టి దోచుకొని తినడం ఏం బతుకు.. ఇకనైనా చంద్రబాబు రాజకీయాలు విరమించుకుంటే మంచిదని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.
విశాఖపట్నంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘బాబు పర్సనల్ సెక్రటరీగా ఉన్న శ్రీనివాస్ ఇంటిపై ఐదు రోజులుగా సోదాలు చేస్తే, వారితో పాటు నారా లోకేష్ బినామీగా ఉన్న కిలారి రాజేష్ ఇంటిని కూడా సోదా చేస్తే.. పూణే, హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీ వివిధ పట్టణాల్లో సోదాలు పూర్తయిన తరువాత డిపార్టుమెంట్ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో సారాంశం. శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటిని సోదాలు చేశాం. వివిధ పట్టణాల్లో కొన్ని టీమ్లు పరిశీలన చేశాయి. ఆ నేపథ్యంలో మొత్తం 40 చోట్ల సోదాలు చేస్తే రూ.2 వేల కోట్లు విదేశాలకు వెళ్లి.. అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చి లావాదేవీలు జరిగి ట్యాక్స్లు ఎగ్గొట్టడమే కాకుండా అవినీతి కార్యక్రమాలు జరిగాయని ప్రకటన చేసింది. శ్రీనివాస్ అనే వ్యక్తి ఫ్రం ఏపీ అని క్లారిటీగా చెప్పారు.
అమరావతిలో రాజధాని అని చెప్పి వ్యాపార సంస్థగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందే సుమారు రూ.46 వేల కోట్లకు ఎప్పుడైతే టెండర్లు పిలిచారో.. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాం. పనులు ప్రారంభించని వాటిని రద్దు చేసి, పనులు చేపట్టిన వాటిని నిలుపుదల చేశాం. దానికి అభివృద్ధి నిరోధకులు అని మాపై నిందలు వేశారు. మాకు అభివృద్ధి కావాలి కానీ అవినీతి అవసరం లేదు. చంద్రబాబులా దోపిడీ మాకు అవసరం లేదు.
రూ.100 కోట్లు దాటిని ప్రతి పనికి రివర్స్టెండరింగ్కు వెళ్తాం. జ్యుడిషియల్ కమిటీ ముందుకు తీసుకెళ్తామని సీఎం వైయస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రకటించారు. పేదల కోసం కట్టిన ఇళ్లలో కూడా అవినీతి చేశారు. రూ.16 వందల నుంచి రూ.2000 వరకు చదరపు అడుగుకు కేటాయించారు. ఇది దోపిడీ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ జగన్ చెప్పారు. ఏరకంగా సామాన్య ప్రజలను దోచుకున్నారో ఇవాళ చూస్తున్నాం. పర్సనల్ సెక్రటరీని ఎంక్వైరీ చేస్తే రూ. 2 వేల కోట్ల దోపిడీ జరిగిందని, మూడు కంపెనీలు ఆర్కే ఇన్ఫ్రా, అవెక్సా ఇన్ఫ్రా, డీఎన్సీ ఇన్ఫ్రా అని పెట్టారు. ఆర్కే ఇన్ఫ్రా ప్రమోటర్గా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, అవెక్సా ఇన్ఫ్రా ప్రమోటర్గా ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్, ఇంకో కంపెనీ ప్రమోటర్ ఈ రోజు వెల్లడవుతుంది. లోకేష్ బినామీ కిలారి రాజేష్ ఈ కుంభకోణాల్లో ఒక కంపెనీకి డైరెక్టర్ ఇది జరిగే వ్యవహారం.
పేదవాడికి కట్టిన ఇళ్లలో ఏ విధంగా దోచుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సీఎం వైయస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రివర్స్టెండరింగ్ తీసుకువచ్చారు. టిట్కో ఇళ్లలో సుమారు 63,744 ఇళ్లులకు రివర్స్టెండరింగ్కు వెళ్లాం. దాని విలువ రూ.3,239 కోట్లు అయితే రివర్స్టెండరింగ్కు వెళ్తే రూ.392 కోట్లు ఆదా అయ్యాయి. అంటే ఏరకంగా ప్రజాధనాన్ని దోచుకున్నారో ఆలోచించండి. రాబోయే రోజుల్లో రూ.4,400 కోట్లు విలువైన 70 వేల ఇళ్లకు రివర్స్టెండరింగ్కు వెళ్లబోతున్నాం. దాంట్లో రూ. 400 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందని ఆశిస్తున్నాం. పోలవరంలో రూ. 800 కోట్లు ఆదా అయ్యింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం, టిట్కోలో రూ.12 వందలు ఆదా అయ్యాయి. అంటే గత ఐదేళ్లు ఈ డబ్బంతా కృష్ణార్పణం చేశారు కదా..? ఐటీ దాడులపై చంద్రబాబు, లోకేష్ నోరు కూడా మెదపడం లేదు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు ఏ విధంగా దోచుకోవచ్చు అని ప్రణాళికలు సిద్ధం చేసి చంద్రబాబుకు ఇచ్చాడు. ఆ కుటుంబరావు కూడా ఇప్పుడు మాట్లాడటం లేదు.
రూ.75 లక్షల నగదు, రూ. 80 లక్షల నగలు అని యనమల, అచ్చెన్నాయుడు, బోండా ఉమా మాట్లాడుతున్నారు. పర్సనల్ సెక్రటరీ తప్పులు అవినీతి నిరోధక శాఖకు దొరకుతాయి. ఏసీబీ కంటే ఇన్కం ట్రాక్స్ వచ్చింది. కంపెనీల మధ్యలో ఉన్నాడని పరిశీలించిన తరువాతే స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి చంద్రబాబు, లోకేష్ ఏం సమాధానం చెబుతారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంచి ట్వీట్ చేశారు. పర్సనల్ సెక్రటరీ దగ్గరే రూ. 2 వేల కోట్లు దొరికితే.. చంద్రబాబు, లోకేష్ దగ్గర సోదాలు చేస్తే ఒక్కొక్కరి దగ్గర రూ. 2 లక్షల కోట్లు దొరుకుతాయేమో..? అని ట్వీట్ చేశారు. టీడీపీ నేతలు ఏరకంగా రాబంధుల్లా పంచుకుతిన్నారో ఇది నిదర్శనం. యనమల ఎందుకు చిలక పలుకులు పలుకుతున్నారో అర్థం కావడం లేదు. ఎల్లో మీడియా దీనిపై చప్పుడు చేయకుండా ఎందుకు మభ్యపెట్టే వార్తలు రాస్తుంది. దీనికి తెలుగుదేశం పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలి. దీనికి చంద్రబాబు బాధ్యత వహించాలి. మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబు దిట్ట. కానీ, ఇప్పుడు మిస్ఫైర్ అయ్యింది. ఈ రూ.2 వేల కోట్ల పక్కన రానున్న రోజుల్లో ఎన్ని సున్నాలు చేరుతాయో తెలియదు.
ఎంపీలను పంపించి మ్యానేజ్ చేయాలని అనుకున్నాడు. ఆఖరికి పవన్ కల్యాణ్ను పంపించి బీజేపీతో జతకట్టించాలని చూశాడు. అప్పటికే ఎంక్వైరీ ఒక అడుగు ముందుకుపడి ఉంటుంది. ఐటీ దాడులను ఆపేందుకు చంద్రబాబు చాలా ట్రై చేశాడు. తండ్రీకొడుకులిద్దరూ ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. సీఎం వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబు అవినీతి గురించి చెబుతున్నారు. పాదయాత్రలో, ఎన్నికల ప్రచార సభల్లో కూడా వ్యవస్థల్లో మార్పు తెస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అస్తవ్యస్థంగా ఉన్న వ్యవస్థలను సీఎం వైయస్ జగన్ గాడిలో పెడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం, ఏపీని నంబర్ స్థానంలో నిలబెట్టేందుకు సీఎం వైయస్ జగన్ ప్రధానితో భేటీ అయితే దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతిపై సమగ్ర విచారణ జరగాలి. చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవడానికి మీడియా ముందుకు వచ్చి సమగ్ర విచారణ కోరాలి. కడిగిన ముత్యం అని చెప్పుకునే లోకేష్.. బయటకు రావాలి.. విచారణ జరిగితే ముత్యమో.. మసిబొగ్గో తెలుస్తుంది. పేదవాడి పొట్టకొట్టి తినడం ఏం బతుకు. చంద్రబాబు రాజకీయాలు విరమించుకుంటే మంచిది.