తాడేపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాల ఘటనల వెనుక దురుద్దేశం కనిపిస్తుందని, పోలీసుల విచారణలో కూడా ఇదే వెల్లడైందని మంత్రి అనిల్కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టి దాని ద్వారా లబ్ధి పొందాలనే నీచమైన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఆలయాల్లో జరిగిన ఘటనలపై డీజీపీ వివరాలు వెల్లడిస్తే..చంద్రబాబు, ఆయన తనయుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తమ ఉనికి కోల్పోతున్నామని టీడీపీ నేతల్లో భయం మొదలైందన్నారు. శనివారం తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాలప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారన్నారు. కేవలం ఏడాదిన్నర పాలనలోనే ప్రజారంజక పాలన అందిస్తూ అన్ని రాష్ట్రాలకు వైయస్ జగన్ ఆదర్శంగా నిలిచారన్నారు.
వైయస్ జగన్ పాలన చూసి ఓర్వలేక టీడీపీ నేతలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా..టీడీపీ, బీజేపీ నేతలు ఎక్కడో ఒక చోట విధ్వంసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిన్న డీజీపీ గౌతం సవాంగ్ దేవాలయాల ఘటనల్లో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయం ఉందని ప్రెస్మీట్లో వెల్లడిస్తే..టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని తప్పుపట్టారు. డీజీపీ ప్రకటించిన జాబితా నిజం కాదా అని ప్రశ్నించారు. మరింత లోతుగా విచారణ చేపడితే నారా వారి నేరాల చిట్టా బయటపడుతుందన్నారు. ఇప్పటికే ఆలయాల ఘటనలో టీడీపీ, బీజేపీకి చెందిన నేతలను అరెస్టు చేశారని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే దేవాలయాల ఘటనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తే సహించమని హెచ్చరించారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
డీజీపీ ప్రకటించిన ప్రతి కేసులను టిడిపి, బిజెపి నేతలు తప్పుడు ప్రచారం చేసినట్లు రుజువైందన్ఆనరు.
తిత్లీ తుఫాన్ లో విగ్రహం ధ్వంసమైతే ఆ ఫోటో ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ఒక పాస్టర్కు సంబంధించి ఐదేళ్ల క్రితం జరిగిన అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చి బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో క్షుద్ర పూజలు చేసే చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసు. విజయవాడలో 40 గుడులను కూల్చిన చరిత్ర చంద్రబాబుదే అన్నారు. వైయస్ జగన్ కు అన్ని మతాల మీద విశ్వాసం ఉందని, దేవుడంటే భక్తి ఉందని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తుంటే టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఆలయాల ఘటనపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసింది. రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టి దాని ద్వారా లబ్ధి పొందాలని నీచమైన ఆలోచన చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఉందన్నారు. పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే నారావారి నేరాలు బయటకు వస్తాయని చెప్పారు. దేవుడితో ఆటలాడిన వారు బాగుపడినట్లు చరిత్రలో లేదని మంత్రి అనిల్కుమార్ యాదవ్ హెచ్చరించారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్మీట్ ముఖ్యాంశాలు ..
- ఇటీవలకాలంలో దేవాలయాలపై దాడులకు సంబంధించి పోలీసులు 29 కేసులను ఛేదించడంతో పాటు 80 మందిని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఛేదించిన 9 కేసులలో రాజకీయ పార్టీలకు చెందిన వారి హస్తం ఉందని డీజీపీ స్పష్టంగా చెబితే.. ఆయనపై విమర్శలు చేయటం వారి దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతుంది. ఈ దాడుల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఎక్కడ బయటపడుతుందోఅన్న భయం చంద్రబాబు, ఆ పార్టీ నాయకుల మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. విగ్రహాలను ధ్వంసం చేయవచ్చుగానీ, నిజాలు మాత్రం బయటకు రాకూడదు అన్నదే వారి బాధలా ఉంది.
- ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొడితే.. ఎవరికి లబ్ధి చేకూరుతుంది, అధికారం కోల్పోయి, పార్టీ ఉనికే ప్రమాదంగా మారిన ఒక్క టీడీపీకి తప్ప అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. దేవాలయాల ఘటనలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవాలన్న దురాలోచన ఏ పార్టీకి ఉంటుంది, వెనక నుంచి కుట్రలు చేసి ముందుకు వచ్చి గగ్గోలు పెట్టేది ఎవరు అన్నది ప్రజలకు ఈపాటికే అర్థమైంది. అది తెలుగుదేశం పార్టీనే.
- దేవాలయాల్లో ఘటనలకు సంబంధించి 9 కేసుల్లో టీడీపీ - బీజేపీలకు సంబంధించిన వ్యక్తుల హస్తం ఉందని పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమైంది. కేవలం స్వార్థ రాజకీయాల కోసం, ఇతర దురుద్దేశాలు, కుట్రలతోనే ఇటువంటి నీచ కార్యక్రమాలకు పాల్పడ్డారన్నది అర్థమౌతుంది. ఏ పార్టీ అయినా, ఏ మతమయినా, ఏ కులమైనా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినవారు ఎవరినైనా, ఎంతటివారైనా శిక్షించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు.
- ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు కేవలం 20 నెలల కాలంలోనే, నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరేలా రూ. 80 వేల కోట్లకు పైగా ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తే... ఇందులో 70-80 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉంటే.. అందులో సింహభాగం సంక్షేమ పథకాలు అందుకున్నది హిందువులు కాదా..? సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల్లో హిందువులు ఎక్కువ భాగం లేరా..?
-
- కుల, మతం, ప్రాంతం భేదం లేకుండా సీఎం శ్రీ జగన్ గారు గొప్ప పరిపాలన చేస్తుంటే.. టీడీపీ ఉనికి ఎక్కడ కోల్పోతుందో అన్న భయంతో, పార్టీని బతికించుకునేందుకు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు.
- గంగా నదిలో మునిగినా, గోపూజ చేసినా, ఉగాది పంచాంగం విన్నా, పూజలు చేసినా.. పూర్తి భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చేయాలి తప్ప 40 ఏళ్ళుగా నేను హిందువును అని చెప్పుకుంటూ.. ఏ పవిత్రమైన కార్యక్రమానికి వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినా, పవిత్రమైన కొండ ఎక్కినా.. బూట్లు వేసుకుని వెళ్ళే వ్యక్తి, బూట్లు వేసుకుని హారతి తీసుకునే వ్యక్తి ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అటువంటి వ్యక్తి చంద్రబాబు హిందూ మత విశ్వాసాలను గౌరవిస్తున్నట్టా..?
- అమరావతి రాజధాని పేరుతో పెద్దఎత్తున ప్రచారం చేసిన చంద్రబాబుకు, అమరావతిలో అమరేశ్వరుడి బొమ్మ పెట్టాలని ఎందుకు అనిపించలేదు. అంటే చంద్రబాబు చెప్పేదొకటి, దొడ్డిదారిన చేసేదొకటి అన్నది అర్థం కావటం లేదా..? ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి కోసమే పైకి నుదుటి మీద బొట్టు పెట్టుకుని తిరుగుతూ, వెనకాల కులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు.
- దేవాలయాలపై జరిగిన దాడుల్లో రాజకీయ పార్టీల హస్తం ఉందని డీజీపీ గారు ముందు ఎందుకు చెప్పలేదని బుద్ధీ-జ్ఞానం లేకుండా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఘటన జరిగితే.. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులతో చెప్పించినట్టు ఈ ప్రభుత్వం ఎప్పుడూ చేయదు. ఏదైనా ఘటన జరిగితే ముందుగా దర్యాప్తు చేస్తారు, ఆ తర్వాతే పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడిస్తారు. గతంలో జగన్ గారిపై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన వెంటనే.. అప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి డీజీపీతో చంద్రబాబు ఏం మాట్లాడించారో చూశాం.
-
- అలా అనుకుంటే ఈ మొత్తం ఘటనల్లో టీడీపీ ప్రేమేయం ఉందని చెప్పవచ్చుగా.. మరి, లోకేష్ ఉన్నాడని చెప్పవచ్చుగా, అలా ఆధారాలు లేకుండా పోలీసులు చెప్పలేదే..?
- సున్నితమైన మతపరమైన అంశంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుంటే, పోలీసులపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం.
- రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి మూడు టీవీ ఛానళ్ళను అడ్డుపెట్టుకుని ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు.
- దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా, గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా.. ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఉంటే.. ఆయనకు, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే, దాన్ని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో కూడా ప్రజలు గమనిస్తున్నారు.
- చంద్రబాబు, టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి అఖిల ప్రియకు సంబంధించిన కిడ్నాప్ కేసు బయటకు వస్తే దాన్ని గురించి ఎక్కడా మాట్లాడరు. దేవాలయాలపై జరిగిన దాడుల్లో, 9 కేసుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా మీ పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉంటే మీడియా ముందుకు వచ్చి ఊగిపోతారా.. వారు మీ పార్టీ కార్యకర్తలు అవునా.. కాదా..? కాకపోతే, వాళ్ళు మా పార్టీ వారు కాదు, అని గుండె మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా చెప్పగలుగుతారా..?
- దేవాలయాల విధ్వంసంలో టీడీపీ/ బీజేపీ శ్రేణులు పాల్గొన్న తొమ్మిది సంఘటనలను పరిశీలిస్తే..
-
- గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదిన కర్నూలు జిల్లా, మద్దికెర పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దమ్మ దేవాలయం లో జరిగిన గుప్తనిధుల తవ్వకాలు జరిపిన కేసులో ఎనిమిది మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేస్తే అందులో నలుగురు తెలుగు దేశం పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నారు.
-
- వారి వివరాలు: *కర్నూలు జిల్లా, గుంతకల్లు మండలం, నల్ల దాసరి పల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. రెండో నిందితుడు కర్నూలు జిల్లా, చిప్పగిరి మండలం, చిప్పగిరి గ్రామానికి చెందిన జయరాముడు. ఈయన తల్లి గతంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు వైకుంఠం మల్లికార్జున్ మద్దతుతో ఎంపీటీసీగా పోటీ చేసింది. మరో నిందితుడు గొల్ల పెద్దయ్య తెలుగు దేశం పార్టీ కార్యకర్త. మరొక ముద్దాయి తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు కె.ఇ. శ్యాం బాబు ప్రధాన అనుచరుడు ఎస్డి. ఫక్రుద్దీన్ భాషా.
- కడప జిల్లా బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న హనుమంతుడి విగ్రహానికి చెప్పుల దండ వేసిన ఘటనలో.. ఆస్తి తగాదా లో భాగంగా ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ దారుణానికి పాల్పడింది తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకుడు బొజ్జన సుబ్బా రెడ్డి... అలా చేయమని చెప్పింది ఎవరో త్వరలోనే తేలుతుంది .
- కర్నూలు జిల్లాలో ఆంజనేయ స్వామి గోపురాన్ని ధ్వంసం చేశారంటూ తెలుగు దేశం పార్టీ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తప్పుడు ప్రచారం చేస్తూ సంబంధిత శాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ఆవేశంతో దుర్భాషలాడాడు. కానీ అక్కడ జరిగిన వాస్తవాన్ని ఆలయ పూజారి స్వయంగా వివరిస్తూ దేవాలయానికి సంబంధించిన విద్యుత్ పనుల సందర్భంగా షాట్ సర్క్యూట్ వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడించాడు. అందులో తాను కాళ్ళు కూడా కోల్పోయానని స్వయంగా బాధితుడే ఏమి జరిగిందో పూస గుచ్చి నట్లు చెప్పాడు. ఈ దుష్ప్రచారానికి పాల్పడిన దేవాలయ కమిటీ చైర్మన్ విశ్వనాథ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది.
- గోలుగొండ మండలం ఏటి గైరంపేటలో రాములవారి ఆలయంలోని వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.. అంటూ గతం లో ఎప్పుడో దెబ్బ తిన్న విగ్రహాన్ని ఇప్పుడు జరిగినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని చేయించింది టిడిపి పార్టీ కి చెందిన పైల సత్తి బాబు, కల్లిద నరేశ్. ఇక్కడ తెర వెనుక ప్రతిపక్ష పార్టీ ముఖ్య నాయకుల పాత్ర ను త్వరలో బహిర్గతం చేస్తాము. అయ్యన్నపాత్రుడు కుమారుడు పోలీసు స్టేషన్ కు ఎందుకెళ్ళాడో బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది.
- ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ తప్పుడు ప్రచారం తో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ పట్టుబడింది తెలుగు దేశం పార్టీ కి చెందిన నాయకులు మద్దసామి మౌలాలి, గాలి హరి బాబు , మించాల బ్రహ్మయ్య, వేల్పుల వెంకట రావు తో పాటు, వారి అనుకూల మీడియాకు చెందిన టీవీ 5, ఏబీఎన్ జర్నలిస్ట్ లు. మీడియా ముసుగులో ఈ అరాచకాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఏమనాలి?
- గుంటూరు జిల్లా నరసరావుపేట లోని శృంగేరి శంకర మఠం లో సరస్వతి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు అపవిత్రం చేశారంటూ తప్పుడు ప్రచారం చేసిన తెలుగు దేశం పార్టీ కి చెందిన సానుభూతి పరుడు చల్లా మధుసూదన్ రెడ్డి A1 నిందితుడు. అతడు అరెస్టు కు ముందే కోర్ట్ నుండి ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. వీరి అకృత్యాలకు వెరసి ఆ విగ్రహాన్నే ఆ స్కూలు యజమాని తరలించాడు.
- రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుని విగ్రహానికి అశుద్ధంతో అపవిత్రం చేసారంటూ ఉద్దేశపూర్వకంగా వివిధ సామాజిక మీడియా లలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి వ్యక్తిగత కార్యదర్శి సందీప్. అదేవిధంగా ఫేక్ ప్రచారానికి కారణ భూతమైన మరో వ్యక్తి ప్రసాద్రబాబు అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అది జీవ సంబంధమైన మలినం కాదు అని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావడంతో కుట్ర కోణం బయట పడింది. ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తులను ఎటువంటి పరిస్థితులలోను వదిలిబెట్టకూడదు.
- శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామం లోని హనుమంతుని విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ గతంలో తిత్లి తుఫాను సమయంలో ధ్వంసమైన విగ్రహం ఫోటోను సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన కొంచాడ రవి కుమార్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సబబో మీరే చెప్పాలి.
- శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక పాఠశాలలో సరస్వతి దేవి ఎడమ చేయిని ధ్వంసం చేశారంటూ సోషల్ మీడియా లో మరో వర్గంపై తప్పుడు ప్రచారం చేసిన ధర్మవరపు ఆచార్య ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అతను బీజేపీ పార్టీ ఎచ్చర్ల మండల అధ్యక్షులు. వాస్తవానికి దాదాపు 2 సంవత్సరాల క్రితమే విగ్రహం పాతపడటం తో చేయి విరగడం జరిగినది. అదే విషయాన్ని అక్కడ ఉన్న ప్రతి ఉపాధ్యాయునికీ తెలుసు. తెలిసి కూడా ఇటువంటి చర్యకు పాల్పడటాన్ని ఏమనాలి? విజ్ఞులు ఆలోచించగలరు.
- ఇక తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాస్టర్ మాట్లాడిన మాటలు అంటూ సోషల్ మీడియాలో, మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యాఖ్యలు ఎప్పుడో 5 ఏళ్ళ క్రితానివి.
- కనక దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించిన చరిత్ర ఎవరిది.. ఎవరి హయాంలో ఆ ఘటన జరిగింది. విజయవాడలో 40 గుడులను కూల్చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది.
-
- సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి అన్ని మతాల మధ్య విశ్వాసం, దేవుడు అంటే నమ్మకం ఉండబట్టే.. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా కోట్ల మందికి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
- దేవాలయాలపై దాడులకు సంబంధించి వీళ్ళ బండారం బయటపడుతుంటే.. డీజీపీ మీద చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు పూనకం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నారా వారి నరాల్లో ఎందుకు వణుకు పుడుతుంది..? తప్పు చేసినవారే భయపడతాడు. ఆధారాలతో సహా ఆలయాలపై దాడుల ఘటనల్లో దోషులను పోలీసులు నిజాయితీగా బయటపెడుతుంటే.. చంద్రబాబు, టీడీపీ నేతల గొంతులు బలహీనతతో అరుస్తున్నాయి.
- నారా వారి నరాలు తెగే పరిస్థితి వస్తుండే సరికి, ఆ భయంతో, అంతర్వేది రథం ఘటన నుంచి, రాముడి విగ్రహం వరకు ప్రతి ఒక్క ఘటనలో వారి బండారం బయటపడుతుందని భయపడుతున్నారు. భయంతోనే గుంపులుగా మీడియాలో అరుస్తున్నారు.
- భగవంతుడితో ఆడుకున్న ఎవరూ కూడా బాగుపడిన పరిస్థితి చరిత్రలో లేదు. ఇటువంటి వారికి భగవంతుడు, ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు.
-
- ఒక సున్నితమైన అంశం మీద టీడీపీ నేతలు నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారంటే.. మేం ఆలయాలను పగులగొట్టిస్తాం.. తప్పుడు ప్రచారం చేయిస్తాం.. పోలీసులు మాత్రం స్పందించకూడదు, మా వాళ్ళను అరెస్టు చేయకూడదు అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉండటం దుర్మార్గం. ఈరోజుకైనా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారా.. అంటే లేదు. అటువంటి వారిని తొలగిస్తే.. పెద్దల పేర్లు ఎక్కడ బయటకు వస్తాయన్న భయం తప్పితే మరొకటి కాదు.
-
- దేవాలయాల్లో దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తులు మా పార్టీ వ్యక్తులు కాదు, మా పార్టీకి సంబంధం లేదని కూడా టీడీపీ-బీజేపీ ఎక్కడా చెప్పలేదు.
- గత 10 నెలల నుంచి కరోనాతో బయటకు రాని వ్యక్తి.. రామతీర్థం ఘటన జరిగినప్పుడు హుటాహుటిన అక్కడకు వచ్చి రాజకీయం చేయాలని చూశాడు. ఎందుకంటే, ఆ ఘటన వెనుక తన మనుషులు ఉండబట్టే, ఆ కుట్ర తనకు స్పష్టంగా తెలుసు కాబట్టే, రాద్ధాంతం చేసి, రచ్చ చేయాలని చంద్రబాబు చూశాడు. చివరికి అభాసుపాలయ్యాడు.
-
- ఒక్క విషయం నేరుగా అడుగుతున్నాం.. దేవాలయాల్లో దాడులు చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, చేయిస్తే, ఎవరికి లబ్ధి జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారికా.. చంద్రబాబు నాయుడుకా..?
-
- ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో.. పసి బిడ్డల నుంచి ముదుసలి వరకు జగన్నామ స్మరణ చేస్తున్నారు. జగన్ గారిని వారి గుండెల్లో నుంచి తీయలేరు కాబట్టి, నీచ నికృష్ట కార్యక్రమాలు చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న ఆలోచన టీడీపీకి తప్ప ఎవరికి ఉంటుంది..?
- చంద్రబాబుకు ఎంతసేపటికీ తన సొంత వర్గం లబ్ధి తప్ప.. ఈ రాష్ట్రంలో మిగతా ఎవరిమీదా ప్రేమ ఉండదు, భక్తి ఉండదు.