ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా

హైకోర్టు సూచనను గౌర‌విస్తూ వాయిదా వేస్తున్నాం

పరిస్ధితులు చక్కబడిన వెంటనే పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటిస్తాం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

అమరావతి: గౌరవ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఇంటర్మీడియట్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈ పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని రేపు హై కోర్టుకు కూడా తెలియజేమన్నారు. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

‘కోవిడ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలన్నీ కేంద్ర ప్రభుత్వమే తయారుచేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ, 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించి కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలు విధించకుండా రాష్ట్రాలకే ఆ అవకాశాన్ని వదిలేసింది. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించేశారు. మరి కొన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. మరి కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి పాస్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. రద్దు కాకుండా ఉన్న రాష్ట్రాల్లో బాగా చదివిన విద్యార్థులకు మంచి మార్కులతో, గ్రేడ్‌లతో సర్టిఫికెట్లు వస్తాయి. మార్కులూ ర్యాంకులూ ఉన్న విద్యార్థులకు మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. 

ఇంటర్‌ తరవాత పెద్ద చదువుల కోసం రాసే పోటీ పరీక్షకు కూడా ఇంటర్‌లో కనీసం ఇంత శాతం మార్కులు వచ్చి తీరాలన్న నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ మార్కులే వారి పైచదువులు, ఉద్యోగావకాశాల పరంగా కీలకం అవుతాయి కాబట్టే... ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలోని మన విద్యార్థి వెనకబడకుండా చూడాల్సిన బాధ్యత ఒక మంచి ప్రభుత్వంగా మన మీద ఉంది కాబట్టే... వారి పరీక్షల నిర్వహణకు మనందరి ప్రభుత్వం ఇంతగా తాపత్రయపడింది. 

పూర్తిగా కోవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఆరోగ్యపరమైన అన్ని నిబంధనలూ అమలు చేస్తూ... ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని భావించాం. అదీగాక, పిల్లల ప్రాక్టికల్స్‌ పూర్తి అయ్యాయి కాబట్టి, ఇక మిగిలి ఉన్న పరీక్షల ప్రక్రియ 6 రోజులు మాత్రమే. అది కూడా రోజుకు కేవలం 3 గంటల పరీక్ష మిగిలి ఉంది. 

పిల్లల ప్రాణాలమీద, వారి భవిష్యత్తుమీద మమకారం ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం, ఇందు కోసం కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు కూడా చేశాం.  ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టు కూడా అభిప్రాయపడినందున, కోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షల వాయిదాను ప్రకటిస్తున్నాం. ఈ పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఇదే విషయాన్ని రేపు హై కోర్టుకు కూడా తెలియజేస్తాం. 

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, ఈతరం విద్యార్థులు రాబోయే ప్రపంచంలో గొప్పగా నిలబడటం కోసం, ఇంటింటా చదువుల విప్లవం కోసం...  మనందరి ప్రభుత్వం గత 23 నెలలుగా ఎంతగా తాపత్రయపడుతోందో ఈ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ, ప్రతి అక్కచెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికి, ప్రతి పిల్లవాడికీ తెలుసు. జగనన్న అమ్మ ఒడి, నాడు–నేడు, ఇంగ్లీష్‌ మీడియం, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన... ఇలా అనేక పథకాలను తెచ్చి, ఈ కోవిడ్‌ సమయంలో కూడా వెనకంజ వేయకుండా అమలు చేస్తూ ఈ తరం పిల్లలు పోటీ ప్రపంచంలో తలెత్తుకుని నిలబడేందుకు, నాణ్యమైన చదువుల ద్వారా ప్రతి ఇంటిలోనూ  ఆయా కుటుంబాల స్థితిగతులు గొప్పగా మార్చేందుకు చిత్తశుద్ధితో, నిబద్ధతతో పని చేస్తున్న ప్రభుత్వం మనది’ అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.
 

Back to Top