విలువల్లేని రాజకీయ ద్రోహి డీఎల్‌ రవీంద్రారెడ్డి

చంద్రబాబు, ఎల్లోమీడియాకు పావుగా మారాడు

డీఎల్ పెద్ద అవినీతిపరుడు.. ఆయ‌న‌ వ్యాఖ్యలు కుట్రపూరితమే..

2014లో కాంగ్రెస్‌లో ఉండి టీడీపీని గెలిపించాడు..

2019లో వైఎస్ఆర్ సీపీలో చేరి టీడీపీకి ఓటేయమన్నాడు

ఇంకా వైయ‌స్‌ఆర్‌సీపీలోనే ఉన్నానని చెప్పుకోవడానికి సిగ్గులేదా..?

రెండుసార్లు మంత్రిగా బర్తరఫ్‌ అయిన చరిత్ర డీఎల్ ర‌వీంద్ర‌ది

దమ్ముంటే 2024 ఎన్నికల్లో పోటీచేసి గెల‌వ‌గలవా..? 

మైదుకూరు వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఫైర్‌

వైయ‌స్‌ఆర్ జిల్లా: దుష్టచతుష్టయం వలలో చిక్కుకున్న డీఎల్‌ రవీంద్రారెడ్డి ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తే ప్రజలెవ్వరూ నమ్మేందుకు సిద్ధంగా లేరని, విలువ‌ల్లేని రాజ‌కీయ ద్రోహి డీఎల్ ర‌వీంద్రారెడ్డి అని మైదుకూరు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రజాదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు, ఎల్లోమీడియా ప్రతినిధులు రామోజీరావు, రాధాకృష్ణలు కలిసి డీఎల్‌ రవీంద్రారెడ్డిని ఒక పావుగా వాడుకుని ఆయన చేత ప్రెస్‌మీట్‌ పెట్టించారన్నారు. డీఎల్ ర‌వీంద్ర పెద్ద అవినీతి ప‌రుడు, ఆయ‌న వ్యాఖ్య‌ల‌న్నీ కుట్ర‌పూరిత‌మేన‌ని కొట్టిపారేశారు. డీఎల్ ర‌వీంద్రారెడ్డి వ్యాఖ్య‌ల‌ను ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. మూడున్న‌రేళ్ల‌లో పార్టీ స‌మావేశాల్లో క‌నిపించ‌ని, క‌నీసం ప్లీన‌రీ స‌మావేశాల‌కు హాజ‌రుకాని డీఎల్ ర‌వీంద్రారెడ్డి.. ఈరోజు వైయ‌స్‌ఆర్‌సీపీలోనే ఉన్నానని చెప్పుకోవడానికి సిగ్గులేదా..? అని ప్ర‌శ్నించారు. వైయ‌స్ఆర్ జిల్లా పార్టీ కార్యాల‌యంలో ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన‌రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ క్యాడ‌ర్‌, సీఎం అభిమానులు, ప్రజలు ఎన్నో సేవాకార్యక్రమాలను పండుగలా జరుపుకున్నారు. ప్రతీ ఒక్కరూ సీఎంకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఇటువంటి సమయంలో నిన్న కడప ప్రెస్‌క్లబ్‌లో డీఎల్‌ రవీంద్రారెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి.. తాను ఇంకా వైయ‌స్‌ఆర్‌సీపీలోనే ఉన్నానంటూ మాట్లాడారు. ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్లు మాట్లాడి విమర్శిస్తే పెద్దగా ప్రాముఖ్యత ఉండదని.. ఆయన ‘నేనింకా వైయ‌స్‌ఆర్‌సీపీలోనే ఉన్నాను..’ సొంత పార్టీ నేతలే మాట్లాడితే ఎవరూ ఖండించరనే కుట్రపూరిత ఉద్దేశంతో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 2014 వరకు ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే.. అప్పట్లో టీడీపీ అభ్యర్థి సుధాకర్‌ యాదవ్‌ గెలుపుకోసం ఆయన సతీమణి సుభద్రను జనరల్‌ ఏజెంట్‌గా పెట్టాడు. 2014లో డీఎల్‌ రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరితే.. మరలా 2019 ఎన్నికలకు ముందు వైయ‌స్‌ఆర్‌సీపీకి వచ్చాడు. సరిగ్గా ఎన్నికలకు రెండ్రోజుల ముందు డీఎల్‌ తెలుగుదేశం నాయకులతో కుమ్మక్కై.. లాస్ట్‌లో మా పార్టీకి వెన్నుపోటు పొడిచి.. ‘నేను తెలుగుదేశం పార్టీకి మద్ధతిస్తున్నాను.. మీరంతా తెలుగుదేశం పార్టీకే ఓట్లేసుకోండి..’ అని బహిరంగంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చాడనేది ఆరోజు ఆంధ్రజ్యోతి పేపర్‌లో కూడా చదువుకోవచ్చు. మరి, ఈరోజు వైయ‌స్‌ఆర్‌సీపీలోనే ఉన్నానని చెప్పుకోవడానికి ఆయనకు సిగ్గులేదా..? ఓటు తెలుగుదేశం పార్టీకి వేయమన్న ఆయన .. ‘ఇంకా నేను వైయ‌స్‌ఆర్‌సీపీనే..’ అనడానికి నోరెలా వచ్చింది?. ఐదారు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ఒక పార్టీని ద్రోహం చేసి.. మరలా అదేపార్టీలో ఉన్నానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా..? అని అడుగుతున్నాను. నీ స్టేట్‌మెంట్‌ విని ప్రజలు నిన్ను ఈరోజు ఛీ కొడుతున్నారు. 

ఏరోజైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నావా..?
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లు అయ్యింది కదా.. మరి, ఈ పార్టీలోనే ఉండి ఉంటే డీఎల్‌ ఏనాడైనా పార్టీ అధినేత,  ముఖ్యమంత్రిని కలిశాడా..? రాష్ట్రవ్యాప్తంగా జనరంజకమైన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి కదా.. ఏరోజైనా ఒక్క కార్యక్రమంలోనైనా డీఎల్‌ పాల్గొన్నాడా..? కనీసం,  పార్టీ ప్లీనరీ సమావేశానికైనా ఆయన హాజరయ్యాడా..? ఎక్కడా డీఎల్‌ రవీంద్రారెడ్డి ఆనవాలే కనిపించలేదు గదా.. మరి ఇంకా ‘నేను వైయ‌స్‌ఆర్‌సీపీ..’ అని ఎలా చెప్పుకుంటాడు..? 

బాబు -ఎల్లోమీడియా పావుగా డీఎల్‌
సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అభిమానాన్ని చాటుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే.. ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు, ఎల్లోమీడియా ప్రతినిధులు రామోజీరావు, రాధాకృష్ణలు కలిసి డీఎల్‌ రవీంద్రారెడ్డిని ఒక పావుగా వాడుకుని ఆయన చేత ప్రెస్‌మీట్‌ పెట్టించారు.

మీ నాన్న నీకిచ్చిన ఆస్తులెంత..?
ఆయన చరిత్ర అందరికీ తెలిసిందే.. ఆయన ఆస్తులేంటి..? రాజకీయాల్లోకి రాకముందు ఆయనకు ఎన్ని ఎకరాలున్నాయి. ఇప్పుడు ఆయన ఆస్తులేంటనేది అందరికీ తెలుసు.. ఒక్క హైదరాబాద్‌ సిటీలోనే నెలకు రూ.50లక్షలు అద్దెలు వచ్చే ప్రాపర్టీస్‌ డీఎల్‌ రవీంద్రారెడ్డికి ఉన్నాయి. అలాంటి ఆస్తులు తనకు లేవని చెప్పమనండి..? ‘మీ నాన్న నీకిచ్చిన ఆస్తులెంత..? నువ్వు ఎన్ని వ్యాపారాలు చేశావు..?’ 

కల్తీమద్యంతో 20 మంది చావుకు కారణం డీఎల్ ..
దుష్టచతుష్టయం వలలో చిక్కుకున్న డీఎల్‌ రవీంద్రారెడ్డి ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తే ప్రజలెవ్వరూ నమ్మేందుకు సిద్ధంగా లేరు. వైయ‌స్‌ఆర్‌సీపీకి ద్రోహం చేసిన వ్యక్తి మాటల్ని ఎవరూ పరిగణలోకి తీసుకుని నమ్మరు. ఆయన రాజకీయ జీవితంలో ఏ ఒక్క పార్టీలోనైనా సిన్సియర్‌గా, నిజాయితీగా స్థిరంగా ఉండి పనిచేసిన చరిత్ర ఉందా..? కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దొంగ లిక్కర్‌ వ్యాపారం ఇదే మైదుకూరులో చేశాడు. అప్పట్లో కల్తీమద్యం తాగి 20 మంది చనిపోతే డీఎల్‌ మామ ఇంట్లో అప్పట్లో తనిఖీలు చేసినప్పుడు వందల లీటర్లు దొంగ లిక్కర్‌ దొరికింది. ఆ కేసులో అప్పుడు డీఎల్‌ బావమరిదిని అరెస్టు చేసి రిమాండ్‌కు కూడా పంపి.. ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్‌ చేసింది నిజం కాదా..? అని అడుగుతున్నాను. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మరలా మంత్రి పదవి దక్కించుకున్నప్పటికీ.. 108 అంబులెన్స్‌ సర్వీసుల్ని ఒక ఏజెన్సీకి అప్పగించేందుకు ముడుపులు తీసుకున్న సంగతి వాస్తవమే కదా.. మరి, ఆరోజు అతని అవినీతి భాగోతం తెలుసుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి కళ్లెం వేశాడు. దానిమీద ఆరోజుల్లో కిరణ్‌కుమార్‌రెడ్డిని బహిరంగంగా విమర్శించాడు. ఈ విషయంపై భగ్గుమన్న కిరణ్‌కుమార్‌రెడ్డి విదేశీపర్యటనలో ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డిని కనీసం ఇన్ఫర్మేషన్‌ కూడా ఇవ్వకుండా మంత్రి పదవి నుంచి ఊడబీకాడు. అది డీఎల్‌ చరిత్ర. 

దమ్ముంటే ఎన్నికల్లో నిలబడు..
‘నువ్వు ఒక వ్యక్తిని విమర్శించే ముందు.. నీ విలువలేంటి..? నువ్వు కుదురుగా ఏ పార్టీలో అయినా నిజాయితీగా పనిచేశావా..లేదా.. అనే ఆలోచన లేదా డీఎల్‌ రవీంద్ర..? ’డీసీసీబీ ఎన్నికల్లో ఆయన ఏ పార్టీకి పనిచేశాడో.. ఎంత డబ్బు నొక్కేశాడో అనేది మైదుకూరు జనాలందరికీ తెలుసు. రాజకీయాల్లో విలువల్లేని వ్యక్తి డీఎల్‌ రవీంద్రారెడ్డి. ఆయనకు దమ్మూధైర్యం ఉంటే 2024 ఎన్నికల్లో పోటీకి నిలబడతావా ..? ఆయన సత్తా ఏంటో తెలుస్తుంది..? సొంత ఊరు ఖాజీపేట, సొంత పంచాయతీ సుంకేసులలో కూడా గెలవలేని డీఎల్‌.. నియోజకవర్గంలోనే డిపాజిట్లు తెచ్చుకోలేని నాయకుడు డీఎల్‌ మాటలు.. నమ్మడానికి ప్రజలెవరూ సిద్దంగా లేరు.

Back to Top