4.90 లక్షల మందికి ‘జగనన్న తోడు’

నేటి నుంచి 21 వరకు లబ్ధిదారులతో బ్యాంకర్ల సమావేశాలు

కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌ ఆదేశాలు 

చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రూ. 10 వేలు రుణం

సకాలంలో రుణాలు చెల్లించిన వారితో పాటు కొత్తవారికీ అవకాశం

అమరావతి: చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే 4,90,376 మందికి జగనన్న తోడు పథకం ద్వారా ఆరో విడతలో మళ్లీ రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు బుధవారం నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల, మునిసిపాలిటీల వారీగా బ్యాంకర్లు, లబ్ధిదారుల సమావేశాలు నిర్వహించనుంది. 25న జిల్లాల స్థాయిలో డీసీసీల సమావేశాలు నిర్వహించి బ్యాంకుల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాల పంపిణీ కార్యక్రమాలను సమీక్షించనున్నారు. దీ­నికి సంబంధించి గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌ షాన్‌మోహన్‌ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ పీడీల ఆధ్వర్యంలోనూ, మునిసిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో ఈ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,28,402 మందికి, పట్టణ ప్రాంతాల్లో 1,61,974 మందికి కలిపి మొత్తం ఈ విడతలో 4,90,376 మందికి ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తోంది. తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, గంపల్లో వస్తువులు అమ్మేవారు, సైకిళ్లు, మోటారు సైకిళ్లు, ఆటోలపై సరుకులు పెట్టుకుని వ్యాపారం చేసే వారితో పాటు చేనేతలు, సంప్రదాయ చేతివృత్తిదారులకు ఎలాంటి ష్యూరిటీ అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సున్నావడ్డీకే జగనన్న తోడు పథకం ద్వారా రూ. 10 వేలు చొప్పున బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తుంది.

ఇప్పటికే ఐదు విడతల్లో లబ్ధిదారులకు రుణాలు తీసుకోగా.. ఆరో విడత రుణ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఈ నెల 11న లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. చిరు వ్యాపారులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి గత 6 నెలలకు వడ్డీ రూ. 15.17 కోట్ల మొత్తం లబ్ధిదా­రుల ఖాతాల్లో ప్రభుత్వం అదేరోజు జమ చేసింది. రుణాలు సకాలంలో చెల్లించిన వారికి బ్యాంకులు రుణ మొత్తాన్ని పెంచి మళ్లీ రుణాలిచ్చేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.   

Back to Top