తాడేపల్లి: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డికి దేవాదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైలం కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు ఆహ్వానపత్రం అందజేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ను ఉపముఖ్యమంత్రి (దేవాదాయ, ధర్మాదాయశాఖ) కొట్టు సత్యన్నారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైలం దేవస్ధానం ఛైర్మన్ రెడ్డి వారి చక్రపాణిరెడ్డి. దేవస్ధానం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న తదితరులు కలిశారు. ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 21 తేదీ వరకు శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని సీఎం వైయస్ జగన్కు వారు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్.జగన్కు ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీశైలం దేవస్ధానం క్యాలెండర్ను, డైరీని సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.