పల్నాడు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఎం.ప్రేమ్ హర్ష వర్ధన్ అనే యువకుడికి కలెక్టర్ శివశంకర్ తక్షణ సాయంగా రూ.1లక్ష చెక్కును అందజేశారు. గత కొంత కాలంగా గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో ప్రేమ్ హర్షవర్ధన్ బాధపడుతున్నాడు. గత నెల 26న అనంతపురంలో జరిగిన జగనన్న వసతి దీవెన సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ని కలిసి తాను పడుతున్న ఇబ్బందులను సీఎంకు వివరించి ఆదుకోవాలని వేడుకున్నారు. దీనిపై స్పందించిన ముఖ్య మంత్రి వైయస్ జగన్ బాధితుడ్ని ఆదుకోవాలని, వైద్య సేవలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వివరాలను పంపాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తక్షణ సాయంగా రూ.1 లక్ష చెక్కును బాధితుడు హర్ష వర్ధన్ కు అందజేశారు. హర్షవర్ధన్ గుండెలో పేస్మేకర్ అమర్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం మీడియా సెంటర్ వద్ద ప్రేమ్ హర్షవర్ధన్కు చెక్కును అందజేశారు. హర్షవర్ధన్ ముఖ్యమంత్రి వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, జిల్లా ఆరోగ్య శ్రీ అధికారిణి డాక్టర్. సునీల తదితరులు పాల్గొన్నారు.