తాడేపల్లి: ఏపీలో రూ. 1,750 కోట్లతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసేందుకు కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ముందుకొచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డితో కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సీఈవో సులజ్జ ఫిరోదియా మొత్వాని, కో–ఫౌండర్ రితేష్ మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్తో కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ ప్రతినిధులు పలు అంశాలపై చర్చించారు. విశాఖలో బ్రాండెడ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ ఆసక్తి కనబర్చింది. స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పూణే సమీపంలోని అహ్మద్నగర్లో నెలకు 6,000 ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో గల ప్లాంట్ని ఈ కంపెనీ ఏర్పాటు చేసింది. కంపెనీ ప్రణాళికలను ముఖ్యమంత్రి వైయస్ జగన్కు కంపెనీ ప్రతినిధులు వివరించి చర్చించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.