పల్నాడు: అప్పుల విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ఎండగడుతూ ఓ వీడియో విడుదల చేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో రూ.1.60 లక్షల కోట్లు అప్పులు చేయడం పట్ల ఆయన అభినందనలు తెలుపుతూ సెటైర్లు వేశారు. ఎడాపెడా అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆఫ్రికాలోని సూడాన్ దేశంగా మార్చుతున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ ఏమన్నారంటే.. ` కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్షా 60 వేల కోట్ల అప్పులు తెచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. వైయస్ జగన్ హయాంలో ఐదేళ్లలో రూ. 3లక్షల 30వేల కోట్ల అప్పులు మాత్రమే చేశారు. ఏడాదికి కేవలం అరవైవేల కోట్ల మాత్రమే అప్పు చేసి వైయస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏకంగా ఏడాదిలోనే లక్షా60వేల కోట్లు అప్పు చేసి రికార్డ్ సృష్టించింది. ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే వాతావరణంలో మార్పులు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో స్విట్జర్లాండ్ మాదిరిగా మంచు కురిసే అవకాశం లేకపోలేదు. ఆ మంచులో మన పిల్లలు ఆడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో వైయస్ జగన్ అప్పులు చేస్తే ఎల్లోమీడియా..ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందని తప్పుడు ప్రచారం చేసింది. వైయస్ జగన్ పై దుష్ప్రచారం చేసిన ఆ పత్రికలు, ఛానెళ్లు ఇప్పుడు ఏమయ్యాయి. ఇలాగే అప్పులు చేస్తూ పోతే భవిష్యత్తుల ఆంధ్రప్రదేశ్ ..అఫ్రికాలోని సూడాన్ దేశం మాదిరిగా మారిపోతుంది` అంటూ కాసు మహేష్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.