కోటంరెడ్డి వాట్సాప్‌ కాల్‌ డేటాను మీడియా ముందుపెట్టాలి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్‌

శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ను ఆయన మిత్రుడు రామశివారెడ్డి రికార్డ్‌ చేశాడంట

ఇంటెలిజెన్స్‌ అధికారి పంపిన క్లిప్పింగ్‌తో ‘ప్లీజ్‌ చెక్‌’ అనే మెసేజ్‌ ఉందా.. లేదా..?

వైరల్‌ అవుతున్న ఆడియోను పంపించి అప్రమత్తం చేస్తే ట్యాపింగ్‌ అంటారా..?

సీఎం వైయస్‌ జగన్‌కు కోటంరెడ్డి మీద విపరీతమైన నమ్మకం ఉంది

కోటంరెడ్డి లోకేష్‌తో రెగ్యులర్‌గా మాట్లాడతాడని టీడీపీ నేతలే చెబుతున్నారు

వైయస్‌ జగన్‌ సీఎంగా ఉండాలనుకునేవారు ఎవరైనా లోకేష్‌తో మాట్లాడుతారా..?

తాడేపల్లి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదని, అది రికార్డింగ్‌ మాత్రమేనని, కోటంరెడ్డికి సన్నిహితుడైన నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్, సీఎం వైయస్‌ జగన్‌ వీరాభిమాని రామశివారెడ్డి అనే వ్యక్తి ఫోన్‌ రికార్డింగ్‌ చేసి అందరికీ పంపించాడని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. అది వైరల్‌ అవుతుంటే ఇంటెలిజెన్స్‌ అధికారి ఆడియో క్లిప్పింగ్‌తో పాటు ‘ప్లీజ్‌ చెక్‌’ అని టెక్స్‌›్ట మేసేజ్‌ కూడా పంపించారన్నారు. బయట స‌ర్క్యూలేట్‌ అవుతుంది ఒకసారి చెక్‌ చేసుకోమని కోటంరెడ్డికి పంపిస్తే దానిలో తప్పేముందని ప్రశ్నించారు. అది తప్పు అయితే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాట్సాప్‌ చాట్‌ బయటపెట్టాలన్నారు. ఆ క్లిప్పింగ్‌తో పాటు ప్లీజ్‌ చెక్‌ అనే టెక్స్‌›్ట మేసేజ్‌ ఉందా.. లేదా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పాలన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని విలేకరులతో మాట్లాడారు. 

గడిచిన ఆరు నెలలుగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాట్సాప్‌ డేటాను మీడియా ముందు పెట్టాలని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కోటంరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన వైయస్‌ఆర్‌ సీపీ అభిమాని రామశివారెడ్డి కాల్‌ రికార్డ్‌ చేసి బయటకు పంపించాడని, నెల్లూరు జిల్లాలోని వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులందరి దగ్గర ఆ రికార్డింగ్‌లు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే మీద చెడుగా తిరుగుతుందని ఇంటెలిజెన్స్‌ అధికారి ఆయనకే చెబితే తప్పేంటీ..? ఎమ్మెల్యేలపై నిఘా ఎందుకు ఉంటుంది..? అని ప్రశ్నించారు. నిజంగా నిఘా ఉండి ఉంటే.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు కోటంరెడ్డి మీద విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టే తనలాంటి వారు చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నా సీఎం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కోటంరెడ్డిని సీఎం వైయస్‌ జగన్‌ అంతగా నమ్మారన్నారు. 

డిసెంబర్‌ 25వ తేదీన కోటంరెడ్డి బ్లూకలర్‌ బెంజ్‌ కారు వేసుకొని చంద్రబాబు ఇంటికి వచ్చి రెండు గంటల పాటు మాట్లాడి వెళ్లాడని టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చెబుతున్నారన్నారు. రెగ్యులర్‌గా నారాయణతో ఉన్న సంబంధాన్ని ఇప్పుడూ కంటిన్యూ చేయమని చంద్రబాబు చెప్పినట్టు టీడీపీకి చెందిన నేతలే చెబుతున్నారన్నారు. లోకేష్‌తోనూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రెగ్యులర్‌గా మాట్లాడుతున్నట్టుగా చెబుతున్నారు. లోకేష్‌ పాదయాత్రకు ముందు కూడా కోటంరెడ్డిని సలహాలు అడిగినట్టు ఆయన పక్కనున్నవారే చెబుతున్నారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఫోన్‌ చేసి పరామర్శించాడని టీడీపీ నేతలు, కోటంరెడ్డి పక్కనున్నవారే చెబుతున్నారు.

 తాను చనిపోయిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో వైయస్‌ జగన్‌ వచ్చి తన మృతదేహానికి దండ వేయాలని, తన ఊపిరి ఉన్నంత వరకు వైయస్‌ జగన్‌ వెంటే ఉంటానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గతంలో మాట్లాడారని పేర్ని నాని గుర్తుచేశారు. వైయస్‌ జగన్‌ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఎవరైనా లోకేష్‌తో మాట్లాడుతారా..? అని ప్రశ్నించారు. లోకేష్‌తో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రోజూ మాట్లాడుతాడని టీడీపీ నేతలే చెబుతున్నారన్నారు. 
 

Back to Top