గుంటూరు: రాజకీయాల్లో ఉన్నంత వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డితోనే ఉంటానని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టుగా కొన్ని మీడియా ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కావాలనే తనపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారే ఆలోచనే తనకు లేదని స్పష్టంగా చెప్పారు. దుష్ప్రచారాలను మానుకోవాలంటూ మీడియా ఛానళ్లకు సూచించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి భిక్షతోనే రాజకీయాల్లోకి వచ్చి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచానని, వైయస్ఆర్ మరణం తరువాత ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైయస్ఆర్ సీపీలో చేరిన మొట్టమొదటి వ్యక్తిని తానేనని చెప్పారు. వైయస్ఆర్ ఆశయాలను అమలు చేస్తున్న జననేత సీఎం జగనన్నతోనే మా ప్రతి అడుగూ ఉంటుందని మేకతోటి సుచరిత భర్త, ఇన్కంటాక్స్ మాజీ కమిషనర్ మేకతోటి దయాసాగర్ ఓ ప్రకటనలో తెలిపారు. కొందరు కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఇంట్లోనే ఉన్నానని, దానిపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియా, ఇతర పద్ధతులు ద్వారా రాజకీయాల్లోకి వస్తున్నారు.. పార్టీ మారుతున్నారు.. అంటూ ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర సర్వీస్లో ఉద్యోగిగా పనిచేసిన తనకు ఏ పార్టీలోనూ సభ్యత్వం ఉండే అవకాశాలు లేవన్నారు.