కాకినాడ: రాజ్యాంగ పరిరక్షణ పేరుతో చంద్రబాబు విడుదల చేసిన లేఖ చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి పెద్ద లేఖ రాసిన చంద్రబాబుకు అధికారంలో లేనప్పుడు మాత్రమే రాజ్యాంగం, ప్రజల హక్కులు, బాధ్యతలు గుర్తుకువస్తాయని, అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్వప్రయోజనాలు, సొంతవారి ప్రయోజనాలే గుర్తుంటాయని చెప్పారు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని సీఎం వైయస్ జగన్ పరిరక్షిస్తున్నారా.. లేక టీడీపీ హయాంలో పరిరక్షించారా..? అనే విషయంపై చర్చకు వచ్చేందుకు చంద్రబాబుకు దమ్ముందా..? అని ప్రశ్నించారు. కాకినాడలో మాజీ మంత్రి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. కురసాల కన్నబాబు ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘‘మహనీయుడు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మనందరికీ గౌరవం, ప్రేమ, భక్తి. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాల ద్వారా మహానుభావుడు అంబేడ్కర్ను స్మరించుకున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందిస్తామని విధిగా భావించాం. కానీ, కొంతమంది తమ రాజకీయ అవసరాల కోసం దేన్నీ విడిచిపెట్టకుండా. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తూ, ప్రతీ అంశాన్ని రాజకీయానికి ఉపయోగించుకునేవారు ఈ దేశంలో కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు. రాజ్యాంగ పరిరక్షణపై చంద్రబాబు ఒక బహిరంగ లేఖ రాశాడు. రాజ్యాంగానికి ఈ రాష్ట్రంలో విలువ ఇవ్వడం లేదని, తూట్లు పొడుస్తున్నారని, చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని నోటికి ఏదివస్తే అది రాసి లేఖను ప్రజలకు పంపించాడు. చంద్రబాబు విడుదల చేసిన లేఖ నిండా రాజ్యాంగ మీద ప్రేమ కంటే.. సీఎం వైయస్ జగన్పై శాపనార్థాలు, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే ఉన్నాయి. చంద్రబాబు లేఖ చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించిన సామెత గుర్తుకువస్తుంది. ఆ సామెత అచ్చుగుద్దినట్టుగా చంద్రబాబుకు సరిపోతుంది. రాజ్యాంగ స్ఫూర్తి గురించి పెద్ద లేఖ రాసిన చంద్రబాబుకు అధికారంలో లేనప్పుడు రాజ్యాంగం, ప్రజల హక్కులు, బాధ్యతలు గుర్తుకువస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు వారికి సంబంధించిన స్వప్రయోజనాలు, సొంత ప్రయోజనాలే గుర్తుంటాయి. రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలించింది ఎవరూ..? పరిపాలిస్తున్నది ఎవరూ..? చంద్రబాబు చర్చకు సిద్ధమా..? ఆనాడు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన కొనసాగించారు. తండ్రి అడుగు జాడల్లో సీఎం వైయస్ జగన్ నడుస్తున్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మాట్లాడుతున్న చంద్రబాబు.. ఆయన హయాంలో ఎలాంటి కార్యక్రమాలు చేశారో చెబుతాం.. చర్చకు వస్తారా..? అబద్ధాలను అలవోకగా, దుర్మార్గంగా సొంత ఎల్లో మీడియాతో ప్రచారం చేసి.. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ ఎవరి హయాంలో జరుగుతోంది.. సీఎం వైయస్ జగన్ పరిరక్షిస్తున్నారా.. లేక చంద్రబాబు హయాంలో జరిగిందా మాట్లాడుకుందాం చర్చకు వచ్చే దమ్ముందా..? చంద్రబాబుకు కన్నబాబు సూటి ప్రశ్నలు.. – ప్రజాస్వామ్యయుతంగా అత్యధిక మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ను గద్దె దించేయడం రాజ్యాంగ పరిరక్షణ అవుతుందా..? – వైయస్ఆర్ సీపీలో గెలిచిన 23మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి, వారిలో 4గురికి మంత్రి పదవులు ఇవ్వడం ఏ రాజ్యంగ స్ఫూర్తి..? – ఓటుకు కోట్ల కేసు అందరికీ గుర్తుంది. డబ్బులిచ్చి ఓట్లు కొనుగోలు చేయాలని ప్రయత్నించడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి..? – అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి, ఏ విధంగా 4700 ఎకరాలను ఓత్ఆఫ్ సీక్రెసీని బ్రేక్ చేసి సంపాదించుకున్నారో ప్రజలందరికీ తెలుసు, సీఐడీ చెప్పింది. మంత్రివర్గ ఉపసంఘం కూడా తేల్చింది. అది రాజ్యాంగ స్ఫూర్తా..? – దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని మాట్లాడటం రాజ్యాంగ స్ఫూర్తా..? దేశానికి బాబు ఇచ్చే సందేశమా..? – బీసీల ఆత్మగౌరవాన్ని కించపరించేలా చంద్రబాబు అనేక సార్లు అనేక వ్యాఖ్యలు చేశాడు.. అది రాజ్యాంగ స్ఫూర్తా..? – విద్యుత్ చార్జీలను తగ్గించాలని రోడ్డు ఎక్కిన రైతులపై కాల్పులు జరిపించి చంపించేయడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి. – బషీర్బాగ్లో గు్రరాలతో తొక్కించడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి..? – జీతాలు పెంచండి అని న్యాయంగా అడిగిన అంగన్వాడీల నుంచి ఎన్జీవోల వరకు లాఠీచార్జ్ చేయించి హింసించడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి..?