తాడేపల్లి: కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు ఆత్మస్తుతి-పరనిందకే పరిమితమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన తెచ్చుకున్న అధికారం ఎంతకాలం కొనసాగుతుందోననే అభద్రతాభావంను చంద్రబాబు, లోకేష్లు మహానాడులో అడుగుడునా వ్యక్తం చేశారని అన్నారు. ఏడాది పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేని అసమర్థ కూటమి పాలనకు ప్రజలు ఇచ్చినవి సున్నా మార్కులేనని అన్నారు. ప్రజలకు తాము చేసిన వంచనను దాచేయడానికి, తన పార్టీలో ఉన్న కొంతమంది కేతిగాళ్లతో, హాస్యగాళ్లతో కామెడీ డైలాగులు చెప్పించి, ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... రాయలసీమలోని కడప వైయస్ఆర్సీపీకి బలమైన ప్రాంతం. ఇక్కడ వ్యూహాత్మకంగా టీడీపీ మహానాడును నిర్వహించి వైయస్ఆర్సీపీని దెబ్బతీస్తున్నామని నిరూపించుకునేందుకు తంటాలు పడింది. అధికారంలో ఉన్న రాజకీయపార్టీగా చాలా ఖర్చు పెట్టి ఆర్భాటంగా మహానాడును నిర్వహించారు. బూతులు, భజనలు, మభ్యపెట్టే మాటలు, కబుర్లు, అణువణువునా రాజకీయ అభద్రత మొత్తంగా ఈ మూడు రోజుల మహానాడులో కనిపించనవి ఇవే. మహానాడులో తాము ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా మొత్తంగా 143 హామీల్లో కనీసం మూడింటి గురించి కూడా తాము నెరవేర్చాము అని చెప్పలేకపోయారు. ఏడాది కాలంలో నేను ఇది చేశానని చెప్పుకోలేని దౌర్భగ్యపు పరిస్థితి చంద్రబాబుది. ఎవరిది హీరోయిజం... మాట తప్పకుండా 99 శాతం నిలబెట్టుకున్న ఘనత వైయస్ జగన్ది. మరి ఆయన ధీరుడా… ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ధీరుడా? ఎవరిది హీరోయిజం? కడపలో ఒక మీటింగ్, ఒక మహానాడు పెట్టుగానే హీరో అయిపోయాయని చంద్రబాబు భ్రమపడుతున్నారు. ఈ ఏడాది పాలనలో కూడా అన్ని సబ్జెక్టుల్లోనూ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ చంద్రబాబుకు సున్నా మార్కులే వచ్చాయి. మరి ఏరకంగా ఆయన హీరో అవుతావు. పేద ప్రజలకు రూ.2.73 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో బదిలీచేసిన జగన్ హీరోనా? లేక వారి దగ్గర తినే కంచం లాగేసుకున్న చంద్రబాబు హీరోనా? ఖచ్చితంగా చంద్రబాబు ఈ రాష్ట్రానికి, ప్రజలకు పక్కా విలన్. రైతు భరోసా కింద గతేడాది రూ.20వేలు, ఈ ఏడాది రూ.20వేలు. మొత్తంగా ఈ రూ.40 వేలు ఎప్పుడు ఇస్తారో మహానాడులో చెప్పలేకపోయారు. అమ్మ ఒడికి పేరు మార్చారు. ఈ పథకం కింద అధికారంలోకి వస్తే ఎంత మంది పిల్లలు ఉంటే అంత ఇస్తామని అన్నారు. ఒకరికి రూ.15వేలు, ఇద్దరికి రూ.30వేలు, ముగ్గురు ఉంటే రూ.45వేలు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇలా ఇస్తామంటూ గొప్పగా చెప్పారు. కనీసం ఒక్కరికైనా ఇచ్చారా చంద్రబాబూ? గతంలో ఇచ్చిన హమీలను నెరవేరుస్తామని మరో కొత్త హామీ ఇచ్చిన ఘనుడు చంద్రబాబు. నిరుద్యోగ భృతి గురించి చెప్పాలంటే నెలకు రూ.3వేల చొప్పున తొలి ఏడాది రూ.36 వేల పెండింగ్, ఈ ఏడాది ఇవ్వాల్సిన రూ.36 వేలు. కనీసం దాని ప్రస్తావన లేదు. ఆడబిడ్డ నిధి కింద గతేడాది ఇవ్వాల్సి రూ.18 వేలు, ఈ ఏడాది ఇవ్వాల్సిన రూ.18వేలు. ఎప్పుడు ఇస్తారో చెప్పే దమ్ము లేక చంద్రబాబు నానా తంటాలు పడ్డారు. పెన్షన్లు వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో 66 లక్షల మందికి ఇచ్చాం. ఇవాళ కూటమి ప్రభుత్వంలో వాటిలో 4 లక్షలు తగ్గించారు. పెన్షన్ దారుడు మరణిస్తే వెంటనే మేం అతని భార్యకు పెన్షన్ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో దీనికి దిక్కూమొక్కూ లేదు. కనీసం ఉచిత బస్సు ప్రయాణం కూడా లేదు. ఈ చిన్న హామీని కూడా ఎప్పుడు నెరవేరుస్తాడో చంద్రబాబు చెప్పలేకపోయాడు. కడపలో బ్రహ్మాండమైన సభ పెట్టామని డబ్బా కొట్టుకోవడం కాదు, ఎన్ని హామీలను నెరవేర్చామని చెప్పుకుంటే వారి గొప్పతనంను అందరూ అభినందించేవారు. అడ్డదోవలో అధికారంలోకి రావడంలో చంద్రబాబు నేర్పరి రాజకీయాల్లో వైకుంఠపాళి వద్దు అని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉంది. వైకుంఠపాళి రాజకీయాలు చంద్రబాబువే. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు. తరువాత మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఒకేసారి నిచ్చెన ఎక్కి ప్రజా మద్దతు లేకపోయినా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబసభ్యులను పూర్తిగా పక్కకుపెట్టేశారు. గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, వారిని నమ్మించి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు వారిని వెన్నుపోటు పొడిచారు. ఏరోజూ సింగిల్ గా ఎన్నికల్లో గెలవలేదు. ఇప్పుడు కూడా రెండు పార్టీలను కలుపుకుంటేగాని గెలవకలేకపోయాడు. చివరకు తన కొడుకు లోకేష్ ను కూడా ఎమ్మెల్సీని చేసి, మంత్రిని చేశాడు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో అందర్నీ తొక్కిపెట్టి పార్టీని గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. వైకుంఠపాళి రాజకీయాలంటే చంద్రబాబువి తప్ప మరెవ్వరికీ కావు. చంద్రబాబులా మేం వైకుంఠపాళి రాజకీయాలు నడపలేదు. ప్రజల మద్దతుతో, వారి ఆశీర్వాదాలతో జగన్ గారు రాజకీయంగా ప్రతి మెట్టు ఎక్కుతూ పైకి వచ్చాడు. జగన్ గారి రాజకీయ ఎదుగుదలలో ఎవరి దయ, దాక్షిణ్యం లేదు. అంతా ప్రజల మద్దతు తప్ప. రాజకీయాల్లో ఎలా ఉండకూడదో దానికి ప్రత్యక్ష ఉదాహరణ చంద్రబాబు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఎలా నిలబెట్టాలో దానికి నిలువెత్తు ఉదాహరణ వైయస్ జగన్. చంద్రబాబు స్ట్రైకింగ్ రేట్ పెద్ద జోక్ తమకు 93 శాతం స్ట్రైక్ రేట్ అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు. ముగ్గురు కలిస్తే వచ్చిన స్కోరు అది. టీడీపీ, జనసేన, బీజేపీ టీంలు కలిసి ఆడితే వచ్చిన స్కోర్ అది. ఒక్కసారి చంద్రబాబు మాత్రమే బ్యాటింగ్ చేసి చూస్తే, క్లీన్ బౌల్డ్ అవుతాడో, డకౌట్ అవుతాడో తెలుస్తుంది. ఏడాది చంద్రబాబు ఇన్సింగ్స్లో ఇప్పటికీ స్కోరు సున్నాయే. వచ్చే నాలుగేళ్లూ అంతే. ఇక తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి పోవడమే తరువాయి. చివరకు చంద్రబాబు ఏ స్థాయికి దిగిపోయాడు అంటే తనను పొగిడేవాడు లేక ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్తో పొగిడించుకునే ప్రయత్న చేశాడు. AIతో డూప్ ఎన్టీఆర్ను తయారుచేసి, చంద్రబాబును, లోకేష్ ను ఎన్టీఆర్ పొగిడినట్టుగా చూపించుకున్నారు. ఎన్టీఆర్ను పదవి నుంచి లాగేసిన తరువాత, ఆయనను తీవ్రంగా మానసిక క్షోభకు గురి చేసిన తరువాత దానికి కారణమైన చంద్రబాబును గురించి ఆయన ఎలా మాట్లాడారో రాష్ట్ర ప్రజలు మరిచిపోయారని అనుకుంటున్నారు. 'జామాతా దశమ గ్రహం' అంటూ చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీఆర్ అన్నారు. ఔరంగజేబులా తండ్రిని, కుటుంబాన్ని నాశనం చేసి రాజకీయాల్లోకి రావాలని అనుకున్న చంద్రబాబు పేరు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదని ఎన్టీఆర్ మాట్లాడారు. ఎన్టీఆర్ పేరు, ఆయన ఫోటోలతో మహానాడు ప్రాంగణాన్ని అలంకరించారు. కానీ ఆయన ఫ్యామిలీని మాత్రం పూర్తిగా ఈ మహానాడుకు దూరంపెట్టారు. బావకి భజనచేసే బాలకృష్ణ కూడా కనిపించలేదు, ఇతర కుటుంబ సభ్యులెవ్వరూ కనిపించలేదు. నందమూరి మహానాడు కాస్తా నారా మహానాడు అయిపోయింది. ఎన్టీఆర్పై ప్రేమ, భక్తి ఉన్నట్లు చంద్రబాబు నటిస్తూ ఉంటారు. తాను కేంద్రంలో ఉన్న పార్టీతో పొత్తులో లేకపోతే, ప్రతి మహానాడులో ఎన్టీఆర్కు భారత రత్న కావాలని అడుగుతాడు. తాను పొత్తులో ఉన్న పార్టీ కేంద్రంలో ఉంటే మాత్రం భారతరత్న ఇవ్వాలని మాత్రం అడగడు. ఇంతకన్నా మోసం ఉంటుందా అని చంద్రబాబు ఆలోచించుకోవాలి. డర్టీ పాలిటిక్స్కు ఆధ్యుడు చంద్రబాబే ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. పాలిటిక్స్ నుంచి క్లీన్ చేయాలంటే ముందు ఈ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఊడ్చి పారేయాలి. రాజకీయాల్లో సారాను, ఓటుకు డబ్బును తీసుకొచ్చింది ఈ చంద్రబాబే. రాజకీయాల్లో చెత్తనే ఏరేయాలంటే చంద్రబాబుతో పాటు ఏరేస్తే తప్ప రాజకీయాలు క్లీన్ కావు. రాజకీయ ముసుగులో ఉగ్రవాదులు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. 'ఆపరేషన్ సింధూర్' స్ఫూర్తితో వారిని ఏరేయాలంటున్నాడు. గతంలో మోడీని ఉగ్రవాది అని, ఇప్పుడు మోడీ తప్ప మాకు వేరే దిక్కులేదనే స్థాయికి చంద్రబాబు పడిపోయాడు. ఆరోజు బూతులు తిట్టి ఇవాళ వారికి రోజూ నీతులు పంచుతున్నాడు. రెండెకరాల నుంచి.. ఆయన మాటల్లోనే రూ.లక్ష కోట్లు సంపాదించిన చంద్రబాబు కన్నా ఆర్థిక ఉగ్రవాదులు ఎవరు ఉంటారు. ఇవాళ రాష్ట్రంలో ఇసుక, మట్టి, లిక్కర్, రాజధాని పనుల్లో అవినీతి వ్యవహారాలతో మొత్తం మేసేసి ప్రజల ఖజానాను పూర్తిగా దోచేస్తున్న నయా ఉగ్రవాదులు, తీవ్రవాదులు వారు కాదా? రెండెకరాల నుంచి దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎలా అయ్యావు చంద్రబాబు? సంస్కారహీనంగా కుటుంబాల గురించి మాట్లాడారు కడప మహానాడు ఘోరంగా ఫెయిల్ అయ్యింది. కానీ చంద్రబాబు మాత్రం మహానాడు అద్భుతంగా విజయవంతం అయ్యిందని చాటుకుంటున్నాడు. అది నిజమా? కాదా అని తెలుసుకునేందుకు చెతులెత్తాలని ఆయనే సభకు వచ్చిన వారిని అభ్యర్థిస్తున్నారు. ఇది చూస్తుంటే ఆయనలోని అభద్రతాభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తుస్సుమన్న మహానాడును గొప్పగా చేశామనేందుకు మహానాడు సభలో గావుకేకలు పెట్టారు. తోలుబొమ్మలాటలో కేతిగాళ్లు మాదిరిగా, బుర్రకథలో హాస్యగాడు మాదిరిగా పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి, ఈ రాష్ట్రంలో బాధ్యత లేని, ఫెయిలైన కొంతమంది చేత స్కిట్లు చేయించే ప్రయత్నం చేశాడు. తెలంగాణలో నర్సిరెడ్డి అనే పొలిటికల్ మీటింగ్స్లో స్కిట్లు చేసే కేతిగాడిని తీసుకువచ్చారు. అతడు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కేసీఆర్, జగన్ గారిని ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడాడు. మరి అదే విధంగా మేం కూడా చంద్రబాబును బొల్లిగాడు అనొచ్చా?, లోకేష్ను పప్పుగాడు అని అనోచ్చా? మాకు సంస్కారం ఉంది కాబట్టే సంయమనం పాటిస్తున్నాం. తల్లీచెల్లి అంటూ వైయస్ జగన్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. మేం కూడా లోకేష్ తల్లి గురించి, మేనత్తల గురించి మాట్లాడితే ఇలాగే ఆస్వాదిస్తారా? ఏనాడైనా లోకేష్ తన మేనత్తలను ఇంటికి పిలిచి బట్టలు పెట్టాడా? కుటుంబ విషయాల గురించి మాట్లాడటం మొదలు పెడితే మేం కూడా మాట్లాడగలమని గుర్తుంచుకోండి. సంస్కారహీనంగా మాట్లాడే సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తే, అటువంటి పరిణామాలు మీకు కూడా ఎదురవుతాయి. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.... పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే మళ్ళీ వైయస్ జగన్ అధికారంలోకి రారు అని రాసిస్తారా అని అడుగుతున్నారని లోకేషే చెబుతున్నారు. పారిశ్రామికవేత్తలకు వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఘన విజయం సాధించి, వైయస్ జగన్ సీఎం అవుతారని అర్థమవుతోంది. అందుకే తొలి ఏడాది మహానాడులోనే మళ్ళీ మమ్మల్నే గెలిపించాలని లోకేష్ అందరినీ వేడుకుంటున్నారు. ఆయనలోని అభద్రతా భావం బయటపడుతోంది. తన రెడ్బుక్ చూసి ఒకరికి గుండెజబ్బు, మరొకరు బాత్రూంలో పడిపోయారని లోకేష్ మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోకేష్కు ముందుంది ముసళ్ళ పండుగ. మొత్తం ప్రభుత్వాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుని, ముడుపులు స్వీకరించడం, వైయస్ఆర్సీపీ వారిపై తప్పుడు కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు. మళ్ళీ వైయస్ జగన్ ప్రజాబలంతో అధికారంలోకి వస్తారు. చంద్రబాబు, లోకేష్ల మాటలు వింటుంటేనే ఆ విషయం అర్థమవుతోంది.