అంబేద్కర్ ఆలోచనా విధానంతో సీఎం వైయస్ జగన్ పరిపాలన 

 సీతారాంపురంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ 

శ్రీ‌కాకుళం:  రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఆలోచ‌నా విధానంతో ఏపీలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న సాగిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గొర్లె కిర‌ణ్‌కుమార్ అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం తెప్పలవలస పంచాయతీ సీతారాంపురం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్  ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలితమే తనలాంటి వారు ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి కారణమని అన్నారు. సమాజంలో అంటరానితనం వంటి వివక్షాపూరిత పరిస్ధితులను ఆకళింపు చేసుకుని నిమ్నవర్గాలు అభివృధ్ది చెందాలనే మహోన్నత ఆశయంతో అంబేద్కర్ గారు పనిచేశారన్నారు. గత ప్రభుత్వాలు అంబేద్కర్ వంటి మహనీయుని మరిచిపోయాయన్నారు. కేవలం వర్ధంతి, జయంతిలకు ఆయన విగ్రహాలకు దండలు వేయడం వంటివాటికి మాత్రమే పరిమితమయ్యాయన్నారు. గతంలో చంద్రబాబు ఎస్సిలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానించి అంబేద్కర్ ఆలోచనలకు తూట్లు పొడిచారన్నారు. రాజ్యాంగాన్ని అపహస్యం చేశారన్నారు. అంబేద్కర్ ఆలోచించిన విధంగా ఎస్సి,ఎస్టి , బిసి,  మైనారిటీల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న యస్ జగన్ కు అండగా నిలవాలని కోరారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థలం మండలం ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, జడ్పీటీసీ టొంపల సీతారాం, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరామునాయుడు,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top