అమరావతి: సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఓ అమ్మలా ఆలోచిస్తారని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. గురువారం సభలో ఆమె గిరిజన సంక్షేమం గురించి మాట్లాడారు. చాలా రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. కానీ గిరిజనులకు ఇన్ని సంక్షేమ పథకాలు అందుతున్నవి ఒక్క ఏపీలోనే. కేవలం 17 నెలల్లోనే డీబీటీ ద్వారా 19,25,382 మంది లబ్ధిదారులకు రూ.3180 కోట్లు నేరుగా అందజేశారు. అలాగే నాన్ డీబీటీ ద్వారా 9,47174 మందికి రూ.696 కోట్లు ఇచ్చారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా గిరిజనులకు ఇంత పెద్ద మొత్తంలో లబ్ధి చేకూర్చారా? చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ట్రైబల్ సబ్ ప్లాన్ కింద రూ.5177 కోట్లు కేటాయించారు. ఇదంతా వైయస్ జగన్ ఘనతే. మా గిరిజన ప్రాంతాలంటే పోరాటాలకు పురిటిగడ్డ. ఆనాడు అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని చూసిన మా గిరిజనులు ..ఈనాడు వైయస్ జగన్ అభివృద్ధి విప్లవాన్ని చూస్తున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు గిరిజనులకు సరైన వైద్యం అందక పిట్టల్లా రాలిపోతుంటే ఒక్క ఆసుపత్రి కూడా నిర్మించలేదు. ఈ రోజు వైయస్ జగన్ పాడేరు ప్రాంతంలో రూ.500 కోట్లతో గిరిజన మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఐదు ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసి గిరిజనులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించనున్నారు. గతంలో పిల్లలు లేరని పాఠశాలలు మూయించారు. ఈ రోజు వైయస్ జగన్ గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లను కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేస్తున్నారు. మారుమూల నియోజకవర్గమైన కురుపాంలో రూ.300 కోట్లతో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయబోతున్నారు. తద్వారా ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుంది. సాలూరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు.
చంద్రబాబు పాలనలో గిరిజన రైతులకు ఒక్క ఎకరా కూడా ఇవ్వలేదు. సీఎం వైయస్ జగన్ ఇవాళ రాష్ట్రంలోని 5,96,500 మంది గిరిజనులకు రైతు భరోసా అందించారు. చంద్రబాబు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈ రోజు మా సీఎం వైయస్ జగన్ 10 వేల శాశ్వత ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చారు. గతంలో గిరిజనుల హక్కులను కాలరాస్తూ బాక్సైట్ తవ్వకాల జీవోను తెస్తే..వాటిని రద్దు చేసిన ఘనత వైయస్ జగన్ ది. వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో గిరిజనులకు అవకాశం కల్పించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ కలిసి ఉండేది. ఇవాళ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వైయస్ జగన్ తెచ్చిన పథకాలన్ని కూడా ఒక ఎత్తు అయితే మా గిరిజనులకు అమ్మ ఒడి పథకం మరో ఎత్తు. మా గిరిజనులు తమ పిల్లలను చదివించే ఆర్థిక స్థొమత లేక చిన్న వయసులోనే పెళ్లిలు చేసేవారు. అమ్మ ఒడి పథకం మా జీవితాల్లో వెలుగులు తెచ్చింది. అందరూ సంతోషంగా పిల్లలను బడికి పంపిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 85 వేల మందికి, వసతి దీవెన ద్వారా 54 వేల మందికి, వైయస్ఆర్ చేయూత ద్వారా 1.40 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే ఎక్కువ భారం మోస్తారు. వాళ్లకు కూడా వైయస్ఆర్ చేయూత ఇవ్వాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. అమ్మ మాదిరిగా వైయస్ జగన్ ఆలోచిస్తున్నారు. వైయస్ఆర్ ఆసరా ద్వారా 3,34,300 మందికి లబ్ధి చేకూరుతుంది. వైయస్ఆర్ పింఛన్ కానుక ద్వారా 361 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని పుష్పశ్రీవాణి వివరించారు.