ఏలూరు: అంతుచిక్కని వ్యాధిపై ప్రభుత్వం సకాలంలో స్పందించి సరైన సమయంలో సరైన చికిత్సలు అందించడంతో సాధారణ స్థితి వచ్చిందని డిప్యూటి సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ చొరవ, వైద్యుల కృషి ఉందని చెప్పారు. శుక్రవారం మంత్రి ఆళ్ల నాని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, బాధితుల ఆరోగ్యంపై ఆరా తీసి, తాజా పరిస్థితిపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఏలూరులో అస్వస్థత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పటి వరకు 607 కేసులు నమోదు కాగా, 538 మంది డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం 33 మంది విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలింపు. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో 35 మందికి ప్రత్యేక వార్డుల్లో వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటి సీఎం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ..సరైన సమయంలో సరైన చికిత్సలు అందించడంతో ఈ రో్జు సాధారణ స్థితికి చేరుకుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిత్యం ఈ ఘటనపై సమీక్షిస్తూ..పరిస్థితిని చక్కదిద్దారు. ఇక్కడ వైద్యులు అహోరాత్రులు శ్రమిస్తూ..బాధితులకు వైద్యం అందించారు. ఈ పరిస్థితికి సంబంధించి ప్రైవేట్ కంటే ప్రభుత్వ వైద్యశాలను బాధితులు ఆశ్రయించి వ్యాధి నయం చేసుకున్నారు. భవిష్యత్లో నాలుగైదు కేసులు వచ్చినా కూడా ఇక్కడ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బాధిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. మంచినీటి సరఫరాకు సంబంధించి పర్యవేక్షణ పనులు సాగుతున్నాయి. 62 మెడికల్ క్యాంపులు కొనసాగుతున్నాయి. మందులు కూడా అందుబ ఆటులో ఉంచామన్నారు. డిశ్చార్జ్ అయిన వారిని కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కోలుకున్న వారిపై సర్వే చేస్తున్నామన్నారు. అవసరమైతే మళ్లీ చికిత్సలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇవాళ సాయంత్రానికి కేంద్ర బృందం సేకరించిన శాంపిల్స్ ఫలితాలు వస్తాయని చెప్పారు. ఇవాళ మధ్యాహ్న మరోసారి అధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తారని మంత్రి ఆళ్లనాని తెలిపారు.