అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ వెంట వైయస్ఆర్ సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరి శంకర్రావు, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నారు. కాగా, ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, వచ్చే నెల 6వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమాల ప్రకారం ఎవరైనా పార్టీలో చేరాలని అనుకుంటే వారు వారి పదవులకు రాజీనామా చేయాల్సిందే. ఈ మేరకు పార్టీ నిబంధనల అనుసారం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డొక్కా రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నిక నిర్వహిస్తుండగా.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైయస్ఆర్ సీపీ అధిష్టానం డొక్కా మాణిక్య వరప్రసాద్కు అవకాశం ఇచ్చింది.