తాడేపల్లి: ఓటీఎస్ లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం సంతోషంగా ఉందని, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల జరుగుతున్న మంచికి ఇది ఉదాహరణ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఓటీఎస్ లబ్ధిదారులకు మరింత మేలు చేసేందుకు గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైతన్య గోదావరి బ్యాంకు ముందడుగు వేసింది. ఒక్కో ఇంటిపై గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం పొందే వెలుసుబాటు కల్పించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో గుంటూరు కార్పొరేషన్కు చెందిన లబ్ధిదారులకు రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. ‘‘గుంటూరు కార్పొరేషన్కు చెందిన లబ్ధిదారులు కేవలం రూ.20 వేలు ఓటీఎస్ కింద చెల్లించి క్లియర్ టైటిల్స్ పొందారు. ఎలాంటి వివాదాలు లేకుండా వారి చేతికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి. ఆస్తిని మళ్లీ బ్యాంకులో తనఖా పెట్టి రూ.3 లక్షల చొప్పున రుణం పొందారు. ఈ డబ్బు వారి కుటుంబ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల జరుగుతున్న మంచికి ఇది ఉదాహరణ. ఓటీఎస్ లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీ మినహాయింపు వల్ల వీరిలో ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున మేలు జరిగింది. ఓటీఎస్ ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల రుణం మాఫీ అవ్వడమే కాకుండా దాదాపు మరో రూ.1600 కోట్ల స్టాంపు డ్యూటీ మినహాయింపుల ద్వారా మరింత మేలు కలిగింది. పేదవాడి జీవితాల్లో గొప్ప మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. వారి కాళ్లమీద వారు నిలబడటానికి ఇవి దోహదం చేస్తాయి. నిర్ణీతకాలంలో ఓటీఎస్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి రుణాలు అందేలా చూడాలి’’ అని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఇతర ఉన్నతాధికారులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం పిలుపుతో మరింత మందికి రుణ సదుపాయం.. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద లబ్ధిదారులకు ఆస్తికి క్లియర్ టైట్సిల్ ఇవ్వడం చాలా ప్రశంసనీయం. జగనన్న గృహ హక్కు పథకం కింద నలుగురు లబ్ధిదారులకు సీఎం వైయస్ జగన్ చేతులుమీదుగా రూ.11,75,000లు రుణాలు ఇస్తున్నాం. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద బ్యాంకు పరిధిలోని నాలుగు జిల్లాల్లో జిల్లాకు లక్ష చొప్పన ఉన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో 228 బ్రాంచీలు ఉన్నాయి. ఓటీఎస్ లబ్ధిదారులు బ్రాంచీలను సంప్రదిస్తే వారికి రుణసేవలు అందిస్తాం. సమాజంలో దిగువనున్నవారు అధిక వడ్డీల బారిన పడకుండా మా బ్యాంకు ఈ చర్యలను చేపడుతోంది. సీఎం పిలుపుతో మరింత మందికి రుణ సదుపాయం కల్పిస్తున్నాం. ఇది లబ్ధిదారుల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరుస్తుంది. సీఎం వైయస్ జగన్ తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు భవిష్యత్తు తరాలకు మంచి పునాదులను వేస్తున్నాయి. - టి. కామేశ్వర్రావు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ ముఖ్యమంత్రి ఆలోచనతో చాలామందికి మేలు జరుగుతోంది జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా క్లియర్ టైటిల్స్ ఇస్తున్నారు. చిన్న చిన్నవారికి కూడా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు ఇది గొప్ప అవకాశం. ఓటీఎస్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆలోచన ఇలాంటి వాళ్లు చాలామందికి మేలు జరుగుతోంది. గతంలో డాక్యుమెంట్లు లేక, రుణాలకు తగిన సెక్యూరిటీ లేక బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి పెద్ద సమస్య వచ్చేది. ఇప్పుడు అలాంటి సమస్యలేదు. - వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్