బద్వేలు: పెట్రోల్, డీజిల్ ధరలు ఎవరు పెంచుతున్నారు..? ధరల పెంపు ఎవరి పరిధిలో ఉందో సోము వీర్రాజు సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఆంధ్రరాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపీ నేతలను ప్రశ్నించారు. బద్వేలులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన జరుగుతుందన్నారు. పేదవారి మతమే తన మతంగా, పేదవారి అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పనిచేస్తున్నారన్నారు. ప్రతి పేదవాడు విద్యావంతుడు కావాలని సీఎం వైయస్ జగన్ తపిస్తున్నారన్నారు. అమ్మఒడి నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ వరకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య నిజాయితీగా వైద్యం అందించారని ప్రజల్లో ఉందన్నారు. ఆయన సతీమణి డాక్టర్ సుధను ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు డాక్టర్ సుధను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయన్నారు.