ఏలూరు: ఆస్పత్రుల్లో బెడ్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరు నియోజకవర్గంలో జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన 30 పడకల ఆస్పత్రిని మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలో 30 బెడ్లను ఏర్పాటు చేసి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను అందుబాటులో ఉంచామని చెప్పారు. నాలుగు రోజుల క్రితం సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన ఆనందయ్య మందుపై చర్చించడం జరిగిందన్నారు. ఇప్పటికే కమిటీ పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఆనందయ్య మందుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, ప్రజలకు ఎలాంటి అపోహలు వద్దన్నారు. టీడీపీ నేతల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కరోనా ఎలా ఎదుర్కొంటున్నామో అసెంబ్లీలో సీఎం వివరించారన్నారు. టీడీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టి.. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.