విశాఖ: జీకే వీధి మండలం దామన్నపల్లి ఎంపీటీసీ కొర్ర భీమరాజు అనారోగ్యంతో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన దామన్నపల్లికి తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో లేక కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంబులెన్స్ లేదని వైద్య సిబ్బంది తెలియజేయడంతో కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు. ఈ విషయాన్ని వైయస్ఆర్సీపీ నేతలు పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి , ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లపల్లి సుభద్ర గారి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఇరువురు నేతలు హుటాహుటిన కేజీహెచ్కు చేరుకుని అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేయించారు. ఇరువురు నేతలు స్వయంగా దగ్గరుండి మృతదేహాన్ని అంబులెన్స్లో ఎక్కించి స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేయించడం పట్ల కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.