కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలి

ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందించాలి

ఎంప్యానెల్, టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లు ఇవ్వాలి

కోవిడ్‌ ఆస్పత్రుల్లో క్వాలిటీ ఫుడ్, శానిటేషన్, ఆక్సిజన్, మెడికల్‌ కేర్‌ తప్పనిసరి

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం సమీక్ష

తాడేపల్లి: ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌ పేషెంట్లకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నారు. ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలని, 50 శాతం కంటే ఎక్కువ మంది పేషెంట్లు వచ్చినా చేర్చుకోవాలని ఆదేశించారు. కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏం మాట్లాడారంటే..

మనం రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తున్నాం. మన రికార్డులను మనమే బద్ధలు కొడుతున్నాం. కోవిడ్‌ చికిత్స కోసం అవసరం మేరకు బెడ్ల సంఖ్య మరింత పెంచండి. ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలి. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా విధిగా చేర్చుకోవాలి. తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు కేటాయించాలి. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లోనూ 50 శాతం బెడ్లు ఇవ్వాలి. అందుకోసం ఆయా ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేసి, వాటిలో సగం బెడ్లు మీరే కేటాయించండి. కోవిడ్‌ చికిత్స కోసం తీసుకున్న అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స చేయాలి. ఇందులో ఎక్కడా తేడా రాకూడదు. ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌లో ఉన్న వాటితో సహా, అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స ఒకేలా ఉండాలి. 

ఆరోగ్య‌శ్రీ ఆస్ప‌త్ర‌ల్లో బెడ్లపై స్పష్టత..
ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో ఉన్న బెడ్లు ఎన్ని? వాటిలో ఎన్ని కోవిడ్‌ రోగులకు ఇస్తున్నారు? అన్నది పూర్తి క్లారిటీ ఉండాలి. దాని వల్ల ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు కోవిడ్‌ రోగులకు ఇస్తున్నామన్నది మనకు స్పష్టత వస్తుంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులలో ఎన్ని బెడ్లు కోవిడ్‌ రోగులకు ఉన్నాయన్న దానిపై మనకు పూర్తి స్పష్టత ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు అన్నింటిలో కలిపి కోవిడ్‌ రోగులకు మొత్తం ఎన్ని బెడ్లు ఉన్నాయన్నది తెలుస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల బెడ్లు. ప్రైవేటు ఆస్పత్రుల బెడ్లు. ఎన్నెన్ని అన్నదానిపై స్పష్టత వస్తుంది. 

కోవిడ్ రోగుల‌కు పూర్తి ఉచితంగా వైద్య సేవ‌లు..
104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ వస్తే, ఆ రోగి ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఆ జిల్లాకు మెసేజ్‌ వెళ్తుంది. వెంటనే కలెక్టర్, జిల్లా యంత్రాంగం స్పందించి, ఆయా ఆస్పత్రులలో రోగులను చేర్పించాలి. ఇది ప్రక్రియ. ఏ ఆస్పత్రి కూడా రోగుల నుంచి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలి. కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలి. 

ఆస్పత్రుల వద్దే కోవిడ్ కేర్ సెంట‌ర్లు..
అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల వద్ద కోవిడ్‌ కేర్‌ సెంటర్లు హ్యాంగర్లు పెట్టి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆస్పత్రి వైద్యులే అక్కడ కూడా సేవలందిస్తారు. అక్కడ అన్ని వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలి.

ఆస్పత్రులు–బెడ్లు..
రాష్ట్రంలో ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రులు. 349 కార్పొరేట్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు. 47  కార్పొరేట్‌ టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు. 94 ప్రైవేట్‌ కేటగిరీ ఆస్పత్రులు.  ఆ విధంగా మొత్తం 598 ఆస్పత్రుల్లో 48,439 ఉండగా, వాటిలో 41,517 మంది చికిత్స పొందుతున్నారు. మరో 6922 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రులలో ఉన్న వారిలో 24,500 మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు.

ఈ 5 అంశాలు మనకు చాలా ముఖ్యం..
అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్‌ బాగుండాలి. ఎక్కడా ఏ లోపం లేకుండా ఉండాలి. శానిటేషన్, క్వాలిటీ ఫుడ్, డాక్టర్ల అందుబాటు, ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, ఆక్సిజన్‌.. ఈ 5 అంశాలు మనకు చాలా ముఖ్యం. వైద్యులు లేకపోతే వెంటనే తాత్కాలికంగా అయినా నియామకాలు జరగాలి.

ఎక్కడా ఏ లోపం ఉండకూడదు..
ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదు. ఎక్కడైనా అవసరం అయితే తగిన మరమ్మతులు చేయండి. కేంద్రం ఇంకా ఎక్కువ ఆక్సిజన్‌ సరఫరా చేసేలా కృషి చేయడంతో పాటు, ఇతర ప్రత్యామ్నాయాలు ఏమిటన్నది ఆలోచించండి.  ప్రతి టీచింగ్‌ ఆస్పత్రి వద్ద 10 కెఎల్‌ సామర్థ్యం, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కెఎల్‌ సామర్థ్యంతో ఆక్సిజన్‌ స్టోరేజీ ఉండాలి. వీలైనంత త్వరగా అవి ఏర్పాటు కావాలి. మనకు రోజుకు 500 టన్నుల ఆక్సీజన్‌ కావాలంటే, ఏం చేయాలన్నది ఆలోచించండి. సరఫరా. నిల్వ ఎలా అన్నది చూడండి.

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ స్పైషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌) ముద్దాడ రవిచంద్ర, 104 సేవల విభాగం ఇన్‌ఛార్జి బాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ మల్లిఖార్జున్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

తాజా వీడియోలు

Back to Top