విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీకి బ్యాండ్‌విడ్త్‌తో ఇంటర్‌నెట్

12,979 పంచాయతీల్లో వైయ‌స్‌ఆర్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు.. మూడు ద‌శ‌ల్లో నిర్మాణం

ఉగాదినాటికి అందుబాటులోకి మొదటి దశ డిజిటల్‌ లైబ్రరీలు

అనంత, చిత్తూరు, విశాఖ, తూ.గో జిల్లాల క‌లెక్ట‌ర్లు ప్ర‌త్యేక దృష్టిపెట్టాలి

పోటీ పరీక్షలకు స‌న్న‌ద్ధ‌మ‌య్యే యువతకు ఈ లైబ్ర‌రీలు ఉపయోగపడాలి

అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: ఆధునిక టెక్నాల‌జీని వినియోగించుకొని ప్రతి విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీకి అంతరాయంలేని బ్యాండ్‌విడ్త్‌తో ఇంటర్‌నెట్ ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వైయ‌స్ఆర్ డిజిటల్‌ లైబ్రరీలపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాల ప్రగతిపై అధికారులు సీఎంకు వివరాలందించారు. రాష్ట్రంలో 12,979 పంచాయతీల్లో వైయ‌స్‌ఆర్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు నిర్మాణం జ‌రుగుతుంద‌ని, మూడు దశల్లో  ఈ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నామన్నారు. తొలివిడతలో చేపడుతున్న 4,530 విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణ పనుల ప్రగతిపై సీఎంకు వివరాలందించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారుల‌ను ఆదేశించారు. ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాల‌ని సూచించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు డిజిట‌ల్ లైబ్ర‌రీలు ఉపయోగపడాల‌న్నారు. విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. వీటి నిర్వహణపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 

జనవరి నాటికి తొలిదశలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. అదే సమయంలో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు ఇతర  మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు. ప్రతి డిజిటల్‌ లైబ్రరీలో డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, సిస్టం ఛైర్లు, ప్లాస్టిక్‌ ఛైర్లు, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఐరన్‌ రాక్స్, పుస్తకాలు, మేగజైన్‌ల ఏర్పాటు తప్పనిసరిగా ఉండాల‌న్నారు. ఉగాదినాటికి ఫేజ్‌-1లో కంప్యూటర్‌ పరికరాలతో సహా అందుబాటులోకి మొదటి దశ డిజిటల్‌ లైబ్రరీలు వ‌స్తాయ‌న్నారు. డిసెంబరు 2022 నాటికి ఫేజ్‌-2  పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాల‌ని సూచించారు. జూన్‌ 2023 నాటికి మూడో దశ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణ లక్ష్యంగా నిరేశించుకోవాలన్నారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో అన్‌ఇంటరెప్టడ్‌ బ్యాండ్‌విడ్త్‌తో కూడిన ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుందద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.  

ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది,  ఐటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఎం మధుసూధన్‌ రెడ్డి, ఏపీటీఎస్‌ ఎండీ ఎం నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top