మ‌న పిల్ల‌ల‌కు మంచి జ‌రగాల‌ని నా త‌ప‌న‌, తాప‌త్ర‌యం

పిల్ల‌ల‌కు మంచి మేన‌మామ‌గా `జగనన్న గోరుముద్ద`తో పౌష్టికాహారం అందిస్తున్నా..

నేటి నుంచి బడి పిల్లలకు ఉదయం పూట రాగిజావ..

రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్ధులకు ల‌బ్ధి

ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగిజావ అందించనున్నాం

రాగిజావ కార్యక్రమంలో భాగ‌స్వాములైన సత్యసాయి ట్రస్టుకు ధ‌న్య‌వాదాలు 

బ‌డి పిల్ల‌ల‌కు రాగిజావ అంద‌జేత కార్య‌క్ర‌మాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైయస్ జగన్‌ 

తాడేప‌ల్లి: ``పిల్లలకు మంచి మేనమామలా, పిల్లల తల్లులకు మంచి అన్నలా జ‌గ‌న‌న్న గోరుముద్ద అనే కార్య‌క్ర‌మాన్ని తీసుకువ‌చ్చాను. ఏడాదికి రూ.1824 కోట్లను గోరుముద్ద కార్యక్రమానికి ఖ‌ర్చు చేస్తున్నాం. ఇందులో రోజుకో మెనూతో పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. గోరుముద్దను మ‌రింత ప‌టిష్టం చేస్తూ పిల్ల‌ల‌కు ఈరోజు నుంచి రాగిజావ అందించే గొప్ప కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతున్నాం`` అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. జ‌గ‌న‌న్న గోరుముద్ద‌లో మ‌రో పోష‌కాహారం జ‌త‌చేస్తూ నేటి నుంచి బ‌డి పిల్ల‌ల‌కు ఉద‌యం పూట రాగి జావ అందించే కార్య‌క్ర‌మాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..
దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క పాప, బాబుకు, వారి తల్లిదండ్రులకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడుకి, బోధనేతర సిబ్బందికి, గోరుముద్దలో భాగంగా పరిశుభ్రంగా, రుచికరంగా వండిపెడుతున్న అమ్మలకు.. ప్రతి ఒక్కరికీ నా అభినందనలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను.

మనం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా.. ప్రతి అడుగులోనూ బడి మానేసే పిల్లల సంఖ్యను ఎలా తగ్గించాలి.. బడులలో సదుపాయాలు మెరుగుపర్చడం ఎలా.. బడి పిల్లల మేథో వికాసానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించడం ఎలా.. పెద్ద చదువులను చదివించడానికి ప్రోత్సహించడమెలా.. అన్న ఇటువంటి అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ప్రతి అడుగులోనూ ఇవి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే సంపూర్ణ పోషణం అనే కార్యక్రమం.. అంటే గర్భవతులుగా ఉన్న మహిళలు, పాలిచ్చే తల్లులు, ఆరు నెలల వయస్సు నుంచి ఆరు సంవత్సరాల వరకూ అంగన్‌వాడీలలో ఉంటున్న పిల్లలకు సంపూర్ణ పోషణద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం.

ప్రతి అడుగులోనూ చేయిపట్టి నడిపిస్తూ..
ఆ తర్వాత విద్యాకానుక, నాడు–నేడు, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్, ఆరో తరగతి నుంచి ప్రతి తరగతిగదిలోనూ ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌) ద్వారా డిజిటల్‌ బోధనను ప్రభుత్వ బడులలో మన పిల్లలందరికీ తీసుకొస్తున్నాం. 8వ తరగతిలోకి వచ్చిన వెంటనే పిల్లలకు ట్యాబులు ఇవ్వడం.. ఇలా ప్రతి అడుగులోనూ పిల్లలను చేయిపట్టి నడిపిస్తున్నాం.
పిల్లలను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం.

ఉన్నత విద్యలోనూ సమూల మార్పులు...
ఉన్నత విద్యలో కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తూ.. జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌ తీసుకొచ్చాం. ఇంటర్నషిప్‌ను తప్పనిసరిచేస్తూ.. ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ని కరిక్యులమ్‌కు అనుసంధానం చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ప్రతి అడుగులోనూ మన పిల్లలందరికీ భావి ప్రపంచంతో పోటీపడేలా వాళ్లు అక్కడ నెగ్గేలా ప్రతి అడుగు వేస్తున్నాం. అందులో భాగంగానే విద్యాకానుక అమలు చేస్తున్నాం.

మరింత పటిష్టంగా గోరుముద్ద– రాగిజావ
గోరుముద్ద కార్యక్రమాన్ని మరింతగా పటిష్టంగా అమలు చేసేలా అడుగులు వేస్తున్నాం. గోరుముద్దను ఇప్పటికే రోజుకొక మెనూతో అమలు చేస్తున్నాం. ఇందులో ఇవ్వాళ్టి నుంచి రాగిజావ కూడా పిల్లలకు అందిస్తూ.. గోరుముద్దను మరింత మెరుగ్గా చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ జాగిజావ వల్ల పిల్లలకు ఐరన్, కాల్షియం కంటెంట్‌ పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 1 నుంచి 10 తరగతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,392 స్కూళ్లలో ఉన్న దాదాపు 38లక్షల మంది పిల్లలకు గోరుముద్ద ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం.

గతానికీ ఇప్పటికీ తేడా...
మన ప్రభుత్వం రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఒక సారి తేడాను గమనించండి.
గతంలో మిడ్‌ డే మీల్స్‌ అంటూ గత ప్రభుత్వ హయాంలో మొత్తం సంవత్సరం అంతా కలిపినా కూడా ఏడాదికి కేవలం రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. వండిపెట్టే ఆయాలకు రూ.1000 ఇస్తూ.. అది కూడా  8–10 నెలలు బకాయిలు పెట్టే పరిస్థితి ఉండేది. చివరకు సరుకులు కూడా 6–8 నెలలుగా బకాయిలు పెట్టే పరిస్థితి. ఇలా బకాయిల పెడితే క్వాలిటీ అనేది ఉండదు. 
అలాంటి అధ్వాన్నమైన పరిస్థితుల నుంచి గోరుముద్ద అనే కార్యక్రమం ద్వారా రోజుకొక మెనుతో పూర్తిగా మార్చి.. ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. గతంలో రూ.450 కోట్లు ఉన్న బడ్జెట్‌ నుంచి ఇప్పుడు ఏడాదికి రూ.1824 కోట్ల రూపాయలు గోరుముద్ద అనే కార్యక్రమం ఖర్చు చేస్తున్నాం. ఇందులో రోజుకో మెనూతో పిల్లలకు భోజనం అందిస్తున్నాం.

మంచి మేనమామలా ఆలోచిస్తూ..
ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలు ఏం తింటున్నారు. పిల్లల మెనూ ఏంటి.. అనే ఆలోచన చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. పిల్లల మెనూ కోసం ఒక ముఖ్యమంత్రి ఇంతలా ఆలోచన చేసిన పరిస్థితులు దేశచరిత్రలో ఉండవేమో.. పిల్లలకు మంచి మేనమామలా, పిల్లల తల్లులకు మంచి అన్నలా  ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మనం చేయకపోతే.. ఇంకెవరు చేస్తారన్న మంచి ఆలోచనతో గోరుముద్దను చేపట్టాం.

వారానికి 15 రకాల పదార్థాలతో మెనూ..
మెనూలో ప్రతి సోమవారం వేడి పొంగళి, ఉడికించిన గుడ్డు దగ్గర నుంచి కూరగాయలు పలావ్, గుడ్డు కూర, వేరుశెనగ చిక్కీ, మంగళవారం అయితే పులిహోర, టమోట పచ్చడి, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు, బుధవారం కూరగాయలు అన్నం, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, వేరుశెనగ చిక్కీ, గురువారం అయితే సాంబార్‌ బాత్‌ లేదా లెమన్‌రైస్‌ విత్‌ టమోట పచ్చడి, ఉడికించిన గుడ్డు, శుక్రవారం అయితే అన్నం ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, వేరుశెనగ చిక్కీ, శనివారం అయితే పప్పు, ఆకుకూరఅన్నం, తీపి పొంగల్‌ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 

ఈ రకంగా వారంలో మొత్తం 15 రకాల ఆహార పదార్థాలు పిల్లలకు గోరుముద్దలో భాగంగా అందిస్తున్నాం. వారంలో 5 రోజులపాటు ఉడికించిన గుడ్లు ఇస్తున్నాం. వారంలో మూడు రోజులు చిక్కి ఇస్తున్నాం. చిక్కీ ఇస్తున్న మూడు రోజులు కాకుండా మిగిలిన మూడు రోజులు మంగళ, గురువారం, శనివారాల్లో రాగి జావ ఇప్పుడు ఇస్తున్నాం. వీటన్నింటి వల్ల పిల్లలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. 

ఈ రాగిజావ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు భాగస్వాములు కావడం నిజంగా మంచి పరిణామం. శ్రీ సత్యసాయి స్వామి వారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమానికి ఉంటాయని భావిస్తున్నాను. దాదాపుగా రూ.86 కోట్లు సంవత్సరానికి ఖర్చయ్యే కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్‌ నుంచి దాదాపు రూ.42 కోట్లు కంట్రిబ్యూట్‌ చేస్తుంటే.. మిగిలిన రూ.44 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఈ మంచి కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తున్నాం. సత్యసాయి ట్రస్ట్‌ వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 

మన పిల్లలకు మంచి జరగాలని ప్రతి అడుగులోనూ మంచి చేయాలని తపన, తాపత్రయం పడుతున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దయ ఉండాలని ఆశిస్తున్నాను. అదే విధంగా పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల ఆశీస్సులు మెండుగా ఎప్పుడూ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కోరుకుంటూ రాగిజావ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను.

చివర‌గా.. ఏప్రిల్‌లో పదోతరగతితో పాటు మిగిలిన పిల్లలకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో.. పరీక్షలు రాయబోతున్న పిల్లలందరికీ కూడా మీ మేనమామ తరపున ఆల్‌ ది వెరీ బెస్ట్‌ తెలియజేస్తున్నాను.

Back to Top