వాలంటీర్ల మహా సైన్యానికి సెల్యూట్  

వాలంటీర్ల స‌త్కార స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

వరుసగా రెండో ఏడాది గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లకు అవార్డులు

ఉత్తమ వలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు

రాష్ట్రవ్యాప్తంగా 2,33,333 మందికి రూ.239.22 కోట్ల నగదు పురస్కారాలు

 లంచాలకు తావు ఇవ్వని వ్యవస్థ తీసుకురావాలని సంకల్పం

దేశం మొత్తం మనవైపు చూసేలా వలంటీర్ల వ్యవస్థ

సేవే పరమావధిగా వలంటీర్ల వ్యవస్థ

 గొప్ప సేవకులు, గొప్ప సైనికులు.. మన వలంటీర్లు

వలంటీర్లు చేస్తున్నది ఉద్యోగం కాదు.. గొప్ప సేవ

ఎవరికి ఓటు వేశారన్న వివక్ష లేకుండా సేవలు

వివక్షకు చోటు లేని పాలన

కుల, మత, రాజకీయాలకు అతీతంగా పాలన

33 సేవలను ప్రతీ ఇంటికి అందిస్తున్నాం..

ఎల్లో పార్టీ కన్నా కనీవినీ ఎరుగని విధంగా ప్రజలకు మేలు చేశాం

తమకు డిపాజిట్లు కూడా దక్కవని ఎల్లో పార్టీకి బాధ, ఏడుపు

సంక్షేమ పథకాలతో వాళ్ల బాక్సులు బద్దలవుతాయని వారందరికీ తెలుసు

మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం

వారికి నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు

తమకు గిట్టని ప్రభుత్వం ఉంటే అంతా ఏకమైపోతారు

రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తున్నారు

వాళ్ల మాదిరి వెన్నుపోటు పొడిస్తే .. అమెరికా అవుతుందట

పేరుకు వేరు వేరు వ్యక్తులు, పార్టీలైనా వీరందరూ గజ దొంగల ముఠా

ఎల్లో బ్యాచ్ దుర్మార్గ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు

వైయ‌స్ జగన్‌ వచ్చాక ప్రజలకు మంచి జరిగిందా.. లేదా అన్నది అలోచించండి

ఎల్లో మీడియా, చంద్రబాబు, దత్తపుత్రుడిని నమ్మనే నమ్మొద్దు

రాష్ట్ర సమస్యలపై ప్రధానిని కలిసి వస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారు

ప‌ల్నాడు:గుండెల్లో మానవతాభావాన్ని నింపుకుంటున్న వార్డు, గ్రామ వాలంటీర్లు చెల్లెల్లు, తమ్ముళ్లకు, మహా సైన్యాన్నికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సెల్యూట్ చేశారు.  లంచాలకు తావులేకుండా వ్యవస్థ రావాలి. కులాలకు, మతాలకు, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా వ్యవస్థ రావాలి. అర్హత ఉంటే చాలు ఏ ఒక్కరూ అడ్డపడకూడదని గొప్ప స్వప్నాన్ని చూశాం. ఈ మూడేళ్ల పాలనలో గొప్ప వ్యవస్థ ఇక్కడ నడుస్తోంద‌న్నారు. దేశం మొత్తం మనల్ని చూస్తోంద‌న్నారు. ఎవరైనా కూడా తమకు వచ్చేది ఎంతా అని లెక్కలు వేసే సమాజంలో ..ఎంత వస్తుందని లెక్కలు వేసుకోకుండా తాము చేసే సేవ ఎంత అని లెక్కలు వేసుకుంటూ పేదల కళ్లలో సంతృప్తిని చూస్తు ..ఆ కళ్లలో కనిపించే సంతోషమే తమకు అశీస్సులు అని భావిస్తున్న వాలంటీర్ల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు.  ఏపీలో అవినీతిరహిత, పారదర్శకమైన పాలన అందిస్తున్నామన్న సీఎం వైయ‌స్‌ జగన్‌.. ప్రజాహితమైన ఈ పాలనను ద్వేషించేవాళ్లను ఏమనాలో అర్థం కావట్లేదని చెప్పారు.  మంచి పాలన అందిస్తుంటే మరో శ్రీ లంక అవుతుందని కామెంట్లు చేస్తున్నారని, మరి వాళ్లలా వెన్నుపోట్లు పొడిస్తే అమెరికా అవుతుందా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కన్నా కనీవిని ఎరుగని రేంజ్‌లో సేవ అందిస్తున్నామని, నచ్చితే అభిమానించడని, నచ్చకపోతే తనను ద్వేషించడన్న సీఎం వైయస్ జగన్‌.. ఎల్లో పార్టీ, అనుబంధ ఎల్లో మీడియా, చంద్రబాబు, ఆయన దత్తపుత్రులు చెప్పే మాటల్ని మాత్రం నమ్మనే నమ్మొద్దంటూ ప్రజలను కోరారు . పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వలంటీర్ల సత్కార సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగించారు..ఆయ‌న ఏమ‌న్నారంటే..ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మాట‌ల్లోనే..  

  • పల్నాడు జిల్లా..26 జిల్లాలు..కొత్తగా ఏర్పాటు కావడం అందులో ఒకటి మన పల్నాడు జిల్లా కావడం ..ఈ జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌గా నరసరావుపేటలో ఈ రోజు మనమంతా కూడా సేవా భావానికి ఈ రోజు ఇక్కడ సెల్యూట్‌ చేస్తున్నాం. నిజంగా ఈ రోజు రాష్ట్రంలో మహా సైన్యం నడుస్తోంది. 1.30 లక్షల మంది సచివాలయంలో పని చేస్తున్నారు. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌. ఏ పథకమైనా వివక్షకు తావు లేకుండా, సోషల్‌ ఆడిట్‌ ద్వారా పారదర్శకంగా పని చేస్తున్న వ్యవస్థ రాష్ట్రంలో పని చేస్తోంది. తూర్పున సూర్యుడు ఉదయించకముందే తలుపుతట్టి గుడ్‌మార్నింగ్‌ చెబుతూ అవ్వాతాతలకు చిరునవ్వుతో పింఛన్‌ ఇస్తున్నారు. వితంతువులకు, వికలాంగులకు 61 లక్షల మంది తలుపు తట్టి నెలనెలా పింఛన్‌ అందిస్తున్న గొప్ప సేవకులు, గొప్ప సైనికులు మన వాలంటీర్లు అని సగర్వంగా తెలియజేస్తున్నానను.
  • ప్రభుత్వమంటే కార్యాలయాల చుట్టూ తిరగాలి. చెప్పులు అరిగేలా తిరిగితే తప్ప పనులు కావనే భ్రమను కొట్టి వేస్తూ..లంచాలు ఇస్తే తప్ప పనులు జరగవు అన్న నమ్మకానికి పాతర వేస్తూ పారదర్శకమైన, లంచాలకు, వివక్షకు తావులేని పాలన, కులాలకు, మతాలకు, రాజకీయాలకు, పార్టీలకు తావులేకుండా సహాయం అందిస్తున్న వ్యక్తి వలంటీర్‌. మన పార్టీకి ఓటు వేశాడు, వేయలేదన్న ఆలోచన లేకుండా వాలంటీర్లు, సచివాలయాల ద్వారా సేవలు అందిస్తున్నారు. 
  • మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి 2019 జూన్‌ నుంచి ఈ నెల వరకు వాలంటీర్లు కేవలం అవ్వతాతలకు, వికలాంగులు, వితంతువులకు పింఛన్‌ రూపంలో రూ.50508 కోట్లు.
  •  ఊహలకు అందని పాలన, నేరుగాఒక బటన్‌ నొక్కితే చాలు, ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా..పాలనలో మార్పు గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది కాదా అభివృద్ధి. 
  • వైయస్‌ఆర్‌ పింఛన్‌ కానుక మొదలు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, అమ్మ ఒడి, ఆరోగ్య ఆసరా, ఇళ్ల స్థలాల పట్టాలు, జగనన్న తోడు, వైయస్‌ఆర్‌ రైతు భరోసా, వైయస్‌ఆర్‌ చేయూత, వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా, వైయస్‌ఆర్‌ కంటి వెలుగు,  ఇన్‌పుట్‌ సబ్సిడీ, జలకళ, జగనన్న చేదోడు, వైయస్‌ఆర్‌ వాహన మిత్ర, వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం, ఈబీసీ నేస్తం, ఇలా అక్షరాల 33 పథకాలను ఈ రోజు ప్రతి ఇంటికి లంచాలకు తావులేకుండా, వివక్షకు తావులేకుండా, రాజకీయాలకు చోటు లేకుండా ప్రతి అర్హుడికి అందుతున్నాయంటే ఇంతకన్న గొప్ప పాలన గతంలో ఎప్పుడైనా చూశామా?
  • ఈ రోజు దిశ వంటి చట్టాలమీద, దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తున్నారు.  ఈ రోజు ఆశ్చర్యంగా అక్కచెల్లెమ్మలు సెల్‌ఫోన్‌ పట్టుకుని బయటకు వెళ్తున్నారు. ఫోన్‌లో ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే చాలు 5, 10 నిమిషాల్లో పోలీసులు అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నారు. 
  • ప్రభుత్వ పథకాలపై ప్రజలందరికీ పూర్తిగా అవగాహన కల్పిస్తూ ..ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం ఎవరికి ఎంత లబ్ధి చేకూరుతుందని చెబుతూ..ప్రతి ఇంటి తలుపు తట్టి అక్కచెల్లెమ్మలకు తెలియజేస్తున్నారు. వివిధ పథకాలకు లబ్ధిదారులతో దరఖాస్తు చేయిస్తున్నారు. ఈ గొప్ప విప్లవాత్మకమైన సేవలను మొత్తం దేశం అభినందిస్తోంది. వాలంటీర్ల సేవలకు రాష్ట్ర ప్రభుత్వం గర్వపడుతోంది. సెల్యూట్‌ చేస్తోంది. 
  • ఎక్కడా కూడా అవినీతికి చోటులేకుండా ఒక గొప్ప వ్యవస్థ ఉండాలని కలలు కన్నాం. మీ ద్వారా ఈ రోజు నిజం చేస్తున్నాం. కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ప్రభుత్వ సేవలన్నీ కూడా  గడప వద్దే అందిస్తూ.. ఎండైనా, వానైనా ,వరదైనా , చలైనా సరే, సెలవైనా, పండుగైనా, కరోనా కష్టమైనా సరే లెక్క చేయకుండా, వెన్ను చూపకుండా ప్రజాసేవే పరమార్ధంగా పని చేస్తున్న మహా సైన్యానికి ఈ రోజు రాష్ట్రమంతా గర్వపడుతోందని సగర్వంగా చెబుతున్నాను.
  • మనందరి ప్రభుత్వం అందిస్తున్న చిరు సత్కారం ఈ రోజు నుంచి మొదలవుతుంది. రాష్ట్రంలోని ప్రతి మండలంలో మూడు రోజుల పాటు కార్యక్రమాలు చేపడుతారు. 20 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 
  • వాలంటీర్లు అంటే స్వచ్ఛంద సేవకులు. వీరు చేస్తున్నది ఉద్యోగం కాదు..గొప్ప సేవ అని సగర్వంగా తెలియజేస్తున్నాం. కాబట్టే మిగతా అన్ని రంగాల కంటే భిన్నంగా  ఈ స్వచ్ఛంద సేవలకు ప్రతి ఏటా కూడా వీళ్లను ప్రోత్సహిస్తూ..నిండు మనసుతో వారి సేవలను  గౌరవించేందుకు ఈ రోజు నుంచి 20 రోజుల పాటు సన్మాన కార్యక్రమాలు చేపడుతున్నాం. రెండో ఏడాది వరుసగా వాలంటీర్లందరికీ కూడా ఈ రోజు వందనం చేస్తున్న పరిస్థితి. ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అని అవార్డులు ప్రదానం చేస్తున్నాం. ప్రతి మండలానికి మూడు రోజుల చొప్పున 20 రోజుల పాటు వలంటీర్ల పురస్కార కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, అధికారులు స్వయంగా పాలుపంచుకుంటారు. ప్రతి వాలంటీర్‌ సేవలకు గౌరవంగా శాలువాలు కప్పి, నగదు పురస్కారం అందించి, అందరికీ బ్యాడ్జి పెట్టి సర్టిఫికెట్‌ ఇచ్చి గౌరవించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
  • సేవా మిత్ర పురస్కారం కింద ఈ ఏడాది 2.28 లక్షల మంది వాలంటీర్లకు అవార్డులు ఇస్తున్నాం. ఈ అవార్డు కింద వాలంటీర్‌కు రూ.10 వేల నగదు, బ్యాడ్జి, శాలువ కప్పి సన్మానం చేస్తాం. చేసిన సేవకు ప్రభుత్వం నుంచి మంచి సర్టిఫికెట్‌ ఇస్తాం.
  • సేవా రత్నం..పురస్కారాలు మండలానికి ఐదుగురు చొప్పున, మున్సిపాలిటీల్లో 10 మంది చొప్పున ఎంపిక చేసిన 4,136 మంది వాలంటీర్లకు సేవా రత్న అవార్డు అందజేస్తున్నాం. ఈ అవార్డు కింద ప్రతి వాలంటీర్‌కు రూ.20 వేలు నగదు, శాలువతో సత్కరించి మెడల్, బ్యాడ్జి, సర్టిఫికెట్‌ ఇస్తాం. 
  • సేవా వజ్ర..ప్రతి నియోజకవర్గంలో ఐదుగురువాలంటీర్లను ఎంపిక చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 870మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డు అందజేస్తాం. ఈ అవార్డు కింద రూ.30 వేలు నగదు, బ్యాడ్జి, మెడల్‌తో పాటు శాలువాతో సత్కరించి ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్‌ అందజేస్తాం. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 2.33 లక్షల మందికి రూ.239 కోట్ల నగదును బహుమానంగా ఇస్తున్నాం. 
  • గతేడాది వాలంటీర్లకు అందించిన సొమ్ము రూ.226 కోట్లు అయితే ఈ ఏడాది రూ.239 కోట్లు, ఈ రెండేళ్లలో రూ.465 కోట్ల నగదు పురస్కారాలు అందించిన ప్రభుత్వం మనది.మీ అన్నది అని సగర్వంగా తెలియజేస్తున్నా.
  • ఈ రోజు గొప్ప వాలంటీర్ల వ్యవస్థలో 55 శాతం నా చెల్లెమ్మలే అని సగర్వంగా తెలియజేస్తున్నా..సేవలకు ఈ స్థాయిలో గుర్తింపు ఇస్తున్న మనసున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం మనది అని ఈ సందర్భంగా మరోసారి మీ అన్నగా తెలియజేస్తున్నా.
  • ఈ ప్రసంగం ముగించే ముందు ఒక విషయం మీ అందరితో పంచుకుంటున్నా..రాష్ట్రంలో రైతులకు గాని, అక్కచెల్లెమ్మలకు గాని, బడిపిల్లలకు, కాలేజీ పిల్లలకు , నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా కాపు, పేద వర్గాల్లోని నా ఓసీ వర్గానికి చెందిన ప్రతి ఒక్క ప్రజలకు కూడా దేవుడి దయతో చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చాడని సగర్వంగా తెలియజేస్తున్నా..అందరికీ కూడా  గొప్ప వ్యవస్థ తీసుకురావడానికి దేవుడు అవకాశం  ఇచ్చాడు. లంచాలు, వివక్ష లేని పాలన తీసుకురాగలిగాం. వివక్ష లేని వ్యవస్థను తీసుకువచ్చాం. నేరుగా బటన్‌ నొక్కిన వెంటనే డీబీటీ ద్వారా నేరుగా ప్రతి  అక్కచెల్లెమ్మ అకౌంట్లోకి నగదు బదిలీ చేశాం. ఇప్పటి దాకా రూ.1,34,386 కోట్లు ఇవ్వగలిగాం.   ఏకంగా క్యాలెండర్‌ఇచ్చి ప్రతి నెల ఏ కార్యక్రమం, ఏ పథకం అమలు చేస్తున్నామో తెలియజేస్తూ ఈ ఏడాది రూ.55 వేల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా అందజేస్తున్నాం.ఇలాగే మరో రెండేళ్లు..ఇదే పద్ధతిలోనే దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగే బలాన్ని దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నా..
  • ఇలా మనందరి ప్రభుత్వం, మనం ఇచ్చిన వాగ్ధానాలు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు, పాదయాత్రలో చెప్పిన హామీలు ఒకే పేజీతో మేనిఫెస్టో ఇచ్చాం. గత ప్రభుత్వాలు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. మన ప్రభుత్వం మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవత్గీతగా భావించి ఇవాళ అమలు చేశామని సగర్వంగా చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా . ఏ సామాజిక వర్గాన్ని తీసుకున్నా కూడా ..గతంలో చూసిన ఎల్లోపార్టీ కన్నా..కనివీని ఎరగని రీతిలో మేలు చేశామని సగర్వంగా చెబుతున్నా..మన నవరత్నాల పాలనలో  ఇలాగే కొనసాగితే తమకు డిపాజిట్లు కూడా దక్కవన్న బాధ, ఆ ఏడుపు ఈ రోజు ఎల్లో పార్టీలో కనిపిస్తోంది. ఆ ఎల్లోపార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీల్లో కనిపిస్తోంది. వీరికి అనుబంధంగా ఉన్న ఎల్లోమీడియాలో కూడా కనిపిస్తోంది. 
  • ఈ రోజు మంచి చేసే వారిపై రాళ్లు పడుతున్నాయి. పండ్లు కాసే చెట్టుపై రాళ్లు వేస్తారన్నట్లుగా ఈ రోజు వీరంతా కూడా బురద జల్లుతూ కుయుక్తులతో దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ ఇలాగే మంచి పనులు చేస్తే..ప్రతి అక్కకు అమ్మ ఒడి అందితే..ప్రతి అక్కచెల్లెమ్మకు ఆసరా, చేయూత దక్కితే..ప్రతి అన్నా తమ్ముడికి రైతు భరోసా అందితే.. ఆరోగ్యం బాగలేని ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందితే..ఇంటికి పంపిటప్పుడు ఆరోగ్య ఆసరా కింద డబ్బులు పెట్టి పంపితే..పెన్షన్‌కానుక కింద నెల ఒకటో తేదీనే నా వాలంటీర్‌ తమ్ముడు, చెల్లెలు పొద్దునే చిరునవ్వుతో పింఛన్‌ సొమ్ము పెడితే ఇక వీళ్ల బాక్స్‌లు బద్దలవుతాయని వీరందరికీ తెలుసు కాబట్టే ఈ రోజు మన రాష్ట్రం గురించి ఈ గొప్ప నాయకులు, గొప్ప గొప్ప మీడియా, గొప్ప గొప్ప అనుబంధ పార్టీలు అందరూ కూడా అంటున్నారు..మన రాష్ట్రం శ్రీలంక అవుతుందట. ఆశ్చర్యమనిపించింది. ఈ రోజు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఆయన గారి ఎల్లోమీడియా ఈ రోజు కొత్త ప్రచారాన్ని అందుకున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీలను నెలబెట్టుకొని ఈ దుర్మార్గుల ముఠా..గతంలో రాష్ట్ర ఖజానాను దోచుకున్న ఈ దొంగల ముఠా..ఎన్నికలప్పుడు పచ్చి అబద్ధాలు చెప్పిన ఈ దొంగల ముఠా..ఎన్నికల తరువాత ప్రజలను మోసం చేసి..వీళ్ల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి పత్తా లేకుండా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఈ దొంగల ముఠా..భవిష్యత్‌లో తమకు ఏ ఒక్కరూ కూడా ఓటు వేయరేమో..జగనన్న పరిపాలన ఈ మాదిరిగా సాగితే మాకు దిక్కు లేదని భావించి..రాష్ట్రం శ్రీలంక మాదిరిగా మారుతుందని చెబుతున్నారు. 
  • పేదలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తే మన రాష్ట్రం శ్రీలంక అవుతుందట.. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని  తమకు మాదిరిగా అమలు చేయకపోతే అమెరికా అవుతుందట. వాళ్ల మాదిరిగా వెన్నుపోటు పొడిస్తే అమెరిక అవుతుందట. మనం అమలు చేస్తే శ్రీలంక అవుతుందట. ఇలా మాట్లాడుతున్న వారికి మనసు గాని, నీతిగాని, న్యాయం కాని, ధర్మం కాని, ఇలాంటి పదాలకు అర్థం ఏ కోశానైనా తెలుసా?. ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరికి కోరుతున్నా.
  • ఇదే ఆంధ్రరాష్ట్రం..ఇదే రాష్ట్ర బడ్జెట్‌..ఐనా కూడా గతంలో వారు డీబీటీ ద్వారా బటన్‌ నొక్కితే లంచాలు లేకుండా, వివక్ష, పక్షపాతానికి తావులేకుండా, పారదర్శకంగా ప్రతిఒక్కరికి అందేలా ఏ రోజు కూడా మంచి చేయలేదు. కానీ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితులు ఉన్నా ఈ రోజు తేడా చూడమని, మన ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించండి.
  • వీరి దోపిడీకి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఇవాళ మంచి చేయకపోగా, మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వంపై అబద్ధాలపై నిందలు వేస్తున్నారు. ఇదే బాబు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఈదే టీవీ5, ఇదే దత్తపుత్రుడు.
  • మన రైతులు, మన పేదలను, మన అక్కచెల్లెమ్మలను, మన పిల్లలను ధ్వేషించే ఇలాంటి వారిని మనుషులు అనాలా? లేదా మనషుల రూపంలో ఉన్న దయ్యాలు అనాలా? వీరికి మద్దతు ఇస్తున్న ఎల్లోమీడియాను మీడియా అనాలా? రక్తపీశాశులు అనాలా? మీరే ఆలోచన చేయండి.
  • రాష్ట్రానికి ఫలానిది కావాలని చెప్పి అడగడానికి నిన్న నేను ఢిల్లీకి వెళ్లాను. ఒక ముఖ్యమంత్రి ఒకప్రదానితో సమావేశం అయ్యాను. గంట పాటు ఆ సమావేశం జరిగింది. జీర్ణించుకోలేని ఈ ఎల్లో మీడియా, బాబు గారు, దత్తపుత్రుడు విష ప్రచారం చేస్తున్నారు. మోదీ గారు వైయస్‌ జగన్‌కు క్లాస్‌ పీకారట. అయ్యా ఎల్లోమీడియాలో  అగ్రస్థానంలో ఉన్న ఈనాడు, రాధాకృష్ణ, టీవీ5 వీళ్లు ఎవరైనా మోదీ సోఫా కిందనో, లేక నా సోఫాకిందనో ఉన్నారా? అని అడుగుతున్నా. అక్కడ నేను, ప్రధాని మాత్రమే ఉన్నాం. 
  • ఇదేరకమైన మాటలు చూస్తుంటే..వీళ్లు చేస్తున్న దుష్ప్రచారం చూస్తుంటే  ఒక్కటే చెప్పగలను. అసూయకు మందు లేదు. ఇంత అసూయ పడితే త్వరగా బీపీ పెరుగుతుంది. త్వరగా గుండెపోటు వస్తుంది.త్వరగా టికెట్టు తీసుకుంటారు. ఇంత అసూయ మంచిది కాదని కచ్చితంగా తెలియజేస్తున్నా. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను. ఈ రోజు యుద్ధం నేరుగా లేదు. నీతిగా ఉన్న రా జకీయ నాయకుడితో యుద్ధం చేయడం లేదు. వ్యవస్థ కూడా చక్కగా లేదు. ఈ రోజు మారిచులతో, రాక్షసుతో యుద్ధం చేస్తున్నాం. 
  • మోసం చేసేందుకు మారిచుడు అనే రక్షసుడు ఏ రూపం కావాల్సిస్తే ఆ రూపంలోకి దూరిపోతారు. వీరు కూడా ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ఆ పార్టీతో జత కడుతారు. వద్దనుకుంటే తిడతారు. బురద వేస్తారు . విడిపోతారు. అమలు చేయరుకాబట్టి ఏ వాగ్ధానం కావాల్సి ఆ  వాగ్ధానం ఇస్తారు. గెలిస్తే చెత్తబుట్టలో వేస్తారు. ఓడిపోయి పక్క రాష్ట్రంలో దాక్కుని పండగకు చుట్టం వచ్చినట్లు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు.విడివిడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వాళ్లకు మంచి జరుగుతుందని వాళ్లు అనుకుంటే ఓట్లు చీలుస్తారు. తమకు గిట్టని ప్రభుత్వం ఉంటే వ్యతిరేక ఓటు చీల్చకూడదని వీళ్లు అనుకుంటే అందరూ ఏకమవుతారు. వీళ్లంతా కూడా ఏకం కావడమే కాకుండా దుష్ప్రచారం చేయడంలో వీరికి వీరే సాటి. ఒక అబద్ధాన్ని చెప్పిందే చెప్పి అదే నిజం చేస్తారు. అందుకే ఈ రోజు మారిచులతో యుద్ధం చేస్తున్నామన్నది అందరూ గుర్తు పెట్టుకోవాలని సవినయంగా తెలియజేస్తున్నా..వీరంతా కూడా పేరుకే వేరు వేరు వ్యక్తులు అయినా, వేరు వేరు పార్టీలు అయినా, ఎల్లోమీడియా ముసుగులో ఉన్న మీడియా అయినా..వీరంతా కూడా గజదొంగల ముఠా.వీరికి నీతి, నియమం లేదు, న్యాయం, ధర్మం లేదు. ప్రజలంటే వీరికి ప్రేమ లేనే లేదు. అధికారం తప్ప వేరే ఎజెండా కూడా వీరికి లేదు. ఇలాంటి రక్షశులతో యుద్ధం చేస్తూ ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఇదంతా గమనించాలని,వీరు చెప్పే మాటలు విననే వినవద్దని సవినయంగా కోరుతున్నా. అభ్యర్థిస్తున్నా. వీరు చేసే దుర్మార్గ ప్రచారాన్ని నమ్మొద్దని వేడుకుంటున్నా. ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి అన్నా తమ్ముడిని ఒక్కటే ఆలోచన చేయమని కోరుతున్నాను. వైయస్‌ జగన్‌ వచ్చిన తరువాత మీకు మంచి జరిగిందా? లేదా అన్నది మీ గుండెలపై చెయ్యి వేసుకొని ప్రశ్నించుకోవాలి. అందరిని  ఇదే కోరుతున్నా. మంచి జరిగిందనుకుంటే వైయస్‌ జగన్‌ను ఆశీర్వదించండి..చెడు జరిగిందంటే వైయస్‌ జగన్‌ను ధ్వేషించండి. కానీ ఈ ఎల్లోమీడియాను, ఈ బాబు, దత్తపుత్రుడిని నమ్మనే నమ్మవద్దని మీ అందరిని కోరుతున్నాను. దేవుడు ఆశీర్వదించాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని ప్రజల చల్లని దీవెనలు మనందరికీ ఉండాలని, నా వాలంటీర్ల తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు, నా సచివాలయంలో పని చేస్తున్న నా చెల్లెమ్మలు, తమ్ముళ్లకు దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన ప్రసంగాన్ని ముగిస్తూ..అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.
  • నరసరావుపేటకు సీఎం వైయస్‌ జగన్‌ వరాల జల్లు
  • ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరిక మేరకు నరసరావుపేటకు సీఎం వైయస్‌ జగన్‌ వరాల జల్లు కురిపించారు. నరసరావుపేట పట్టణానికి ఫ్లై ఓవర్‌ మంజూరు చేస్తున్నా..ఇక్కడే ఆటో నగర్‌ను కూడా మంజూరు చేస్తున్నా. వెటర్నరీ పాలిటెక్నిక్‌ కాలేజీ కూడా మంజూరు చేస్తున్నా..మరొక్కసారి మీ అందరి చిక్కటి చిరునవ్వులకు, మీ అందరి గుండెల్లో ప్రభుత్వం పట్ల, నా పట్ల ఉన్న ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు తెలుపుతూ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సెలవు తీసుకున్నారు.
  •  
Back to Top