క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడొద్దు

అంగన్‌వాడీల రూపురేఖలు మార్చబోతున్నాం

కొత్తగా 27,438 భవనాలు రెండు దశల్లో నిర్మాణం

2021 జూన్‌ 30 నాటికి తొలిదశ పనులు పూర్తి చేయాలి

మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

అంగన్వాడీ కేంద్రాల్లో ‘నాడు–నేడు’పై సీఎం సమీక్ష

తాడేపల్లి: అంగన్‌వాడీల రూపురేఖలు పూర్తిగా మార్చబోతున్నాం.. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులు, అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, సీఎం నీలం సాహ్ని, శివు సంక్షేమ శాఖ, విద్యాశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘కొత్తగా 27,438 భవనాల నిర్మాణం చేపట్టనున్నాం. తొలి దశలో 17984, రెండో దశలో 9454 కేంద్రాల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లో తొలి దశ పనులు మొదలు పెట్టాలని, వచ్చే ఏడాది నవంబర్‌ 14న రెండో దశ పనులు ప్రారంభించాలని సూచించారు. నాడు– నేడులో భాగంగా ఈ నెల 30లోగా స్థలాల గుర్తింపు పూర్తిచేయాలని ఆదేశించారు. 

అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీల ఏర్పాటు, మెటీరియల్‌ సేకరణ పూర్తిచేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. తొలిదశ పనులు వచ్చే ఏడాది జూన్‌ 30 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మహిళా శక్తి సూపర్‌వైజర్లు ఇంగ్లిష్‌లో మాట్లాడేలా శిక్షణ ఇప్పించాలన్నారు. నవంబర్‌ రెండో వారం నుంచి పీపీ–1, పీపీ–2 స్కూళ్లు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ టీచర్స్‌ ట్రైనింగ్‌ విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని, అంగన్‌వాడీల్లో క్రీడాస్థలం ఉండేలా మార్పులు చేయాలని ఆదేశించారు. 
 

Back to Top