వేస‌విలో విద్యుత్ కొరత లేకుండా చూసుకొండి

 ఎనర్జీ‌, విద్యుత్‌ ఉత్పత్తి,  పంపిణీ సంస్థల పని తీరుపై సీఎం వైయ‌స్ జగన్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:వేసవి దృష్ట్యా వచ్చే మూడు, నాలుగు నెలల్లో విద్యుత్‌ కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా ఎంతమేరకు విద్యుత్ అవసరమవుతుందో ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల పని తీరుపై సమీక్ష నిర్వహించారు.

రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు సబ్సిడీపై ఇస్తున్న కరెంటు, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా ఇస్తున్న కరెంటు సరఫరాపై అధికారులతో చర్చించారు. ఈ  సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌ మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటికి నిధులను సకాలంలో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ప్రణాళిక వేసుకోవాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. 

కృష్ణపట్నం, విజయవాడలో నిర్మాణంలో ఉన్న థర్మల్‌ యూనిట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యూనిట్ల నిర్మాణం దీర్ఘ కాలం పాటు కొనసాగితే అవి భారంగా తయారవుతాయని తెలిపారు. సత్వరమే నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేలు జరుగుతుందని అధికారులకు సూచించారు.

జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్తున్న 15యూనిట్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాని సీఎం వైయ‌స్ జగన్‌ అధికారులను ఆదేశించారు. బొగ్గు సరఫరాపై నిరంతరం సమీక్ష చేసి అవసరాలకు అనుగుణంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఇంధనశాఖ ఎక్స్ అఫిసియో ప్రిన్సిపల్ సెక్రటరీ జీ సాయిప్రసాద్‌, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top