క్వారంటైన్లను నిరంతరం పరిశీలించాలి

టెలీ మెడిసిన్‌, విలేజ్‌ క్లినిక్‌, పీహెచ్‌సీల మధ్య సమన్వయం ఉండాలి

ధాన్యం సేకరణలో పొరపాట్లు జరగకూడదు

వ్యవసాయ అడ్వయిజరీ బోర్డుల ఏర్పాటుకు సీఎం ఆదేశం

రైతు భరోసా కేంద్రాల్లో నెట్‌, విద్యుత్‌ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలి

సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: క్వారంటన్‌ సెంటర్లను నిరంతరం పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, హెల్త్‌ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి హాజరయ్యారు.  

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. క్వారంటైన్‌ సెంటర్లను నిరంతరం పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌, విలేజ్‌ క్లినిక్‌, పీహెచ్‌సీల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. టెలీ మెడిసిన్‌ ద్వారా ప్రిస్క్రిప్షన్‌ పొందడం, అక్కడ నుంచి నేరుగా విలేజ్‌ క్లినిక్‌ ద్వారా మందులు సరఫరా చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణబాబుకు సూచించారు. 

క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న ప్రతి ఒక్కరి సెల్‌ నంబర్‌ తమ వద్ద ఉందని, కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ర్యాండమ్‌గా కాల్‌చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. గుజరాత్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం నుంచి వచ్చిన మత్స్యకారులకు పూల్‌ శాంపిల్స్‌ చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని అన్నారు. ఇక శ్రీకాకుళం చేరుకునేవారికి కూడా సెంటర్లు ఏర్పాటుచేసి, పరీక్షలు చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని తెలిపారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,00,997 కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించామని, నిన్న ఒక్కరోజే 7,902 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రతి మిలియన్‌కు 1,919 చొప్పున పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు, 79 వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు, 68 యాక్టివ్‌ క్లస్టర్లు, 53 డార్మంట్‌ క్లస్టర్లు, 35  క్లస్టర్లలో 28 రోజుల నుంచి కేసులు లేవని అధికారులు వెల్లడించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32,792 మందిలో 17,585 మందికి పరీక్షలు చేశామని, మిగిలిన వారికి 2–3 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. వీరిలో 4వేల మంది హైరిస్క్‌ ఉన్నవారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే వీరికి పరీక్షలు చేసి లక్షణాలు ఉంటే.. ముందస్తు వైద్యం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు సీఎంకు తెలిపారు.

అన్ని జిల్లాల్లో ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరిస్తున్న సమయంలో బస్తాకు కొంత ధాన్యాన్ని మినహాయిస్తున్నారంటూ రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సమావేశంలో చర్చించారు. దీనిపై సీఎం వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నాసరే.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సరికాదన్నారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని, వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించించారు.  పంటలను రోడ్డుమీద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవని, అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదన్నారు. 

ధాన్యం సేకరణలో పొరపాట్లు జరగకుండా చూడాలని, చీనీ, అరటి, టమాట, మామిడి ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలకు నెట్‌, విద్యుత్‌ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఏ ఊరిలో ఏ పంట వేయాలన్న విషయాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వ్యవసాయ అడ్వయిజరీ బోర్డులు, జిల్లా అడ్వయిజరీ బోర్డులు, మండల అడ్వయిజరీ బోర్డుల ఏర్పాటుకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. పంటలు వేసేటప్పుడు ధర ప్రకటించి రైతుకు ఆ ధర దక్కేలా చూడాలన్నారు.  

దీనివల్ల రైతుల్లో విశ్వాసం కలుగుతోంది. పంటలను ఈ-క్రాపింగ్‌ చేయడం, రైతు భరోసా కేంద్రాలను వినియోగించి వాటిని కొనుగోలు చేయడం వంటి ప్రక్రియలన్నీ వ్యవస్థీకృతంగా సాగిపోవాలని, గత ప్రభుత్వం హయాంలో ఏ రోజూ వ్యవసాయం మీద దృష్టిపెట్టలేదు. మన ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాటి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రత్యేకంగా దృష్టిపెట్టి విస్తృతంగా సమీక్షించుకుంటున్నాం. ఇంతచేస్తున్నప్పుడు కచ్చితంగా ఫలితాలు రావాలని అధికారులను సీఎం ఆదేశించారు.
 

Back to Top