ఆగస్టు 15 నుంచి అమలులోకి ఫ్యామిలీ డాకర్ట్‌ కాన్సెప్ట్‌

తాడేపల్లి: ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ఫ్యామిలీ డాకర్ట్‌ కాన్సెప్ట్ అమ‌లులోకి తీసుకురావాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు.  ఈ నేపథ్యంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేయనున్నట్టు తెలిపారు. ఇక ఆరోగ్య శ్రీలోకి మరిన్ని వైద్య సేవలు చేర్చనున్నారు. అదనంగా కొత్త ప్రొసీజర్లు చేర్చాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.  

సమీక్షలో పూర్తి అంశాలు.. 

► ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలి. ఆగష్టు 1వ తేదీ నుంచి పెంచిన చికిత్సలను చేర్చేలా చర్యలు చేపట్టాలి. 
► ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. దశలవారీగా అమలు చేయాలి.
► విలేజ్‌ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్‌ వీడియో అనుసంధానత ఉండాలి.
► పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారుచేస్తామని అధికారులు, సీఎం జగన్‌కు తెలిపారు.
► ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా 2446 చికిత్సలకు ఉచితంగా వైద్యం అందిస్తోంది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం.

ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వర్చువల్‌ బ్యాంకు ఖాతాలు

► ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి వర్చువల్‌ బ్యాంకు ఖాతాలోకి.. అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపు.
► ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్‌ ఫాం, చికిత్స పూర్తైన తర్వాత ధృవీకరణ పత్రం.
► ధృవీకరణ పత్రంలో వైద్యంకోసం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలు. అలాగే రోగి కోలుకునేంతవరకూ ఆరోగ్య ఆసరా ద్వారా అందుతున్న సహాయం వివరాలు.
► రోగి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారా? పూర్తి ఉచితంగా వైద్యం అందిందా? అనే విషయాలను కూడా ధృవీకరించేలా పత్రం. 
► ఎవరైనా లంచం లేదంటే అదనపు రుసుము వసూలు చేసిన నేపథ్యంలో ధృవీకరణ పత్రంలో ఫిర్యాదులకోసం ఏసీబీకి కేటాయించిన టోల్‌ఫ్రీ నెంబర్‌ 14400 లేదా 104 ఉంచాలని సీఎం జగన్‌ ఆదేశాలు.
► రోగి ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన వారం తర్వాత ఆరోగ్య సిబ్బంది సంబంధిత గ్రామానికి వెళ్లి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి మీద విచారణ చేయాలని ఆదేశం. 
► మరింత సహాయం అవసరమైన పక్షంలో సమన్వయం చేసుకుని ఆ సహాయం అందేలా చూడాలని సీఎం జగన్‌ సూచన.
► రోగికి అందిన సేవలు, అదనంగా కావాల్సిన మందులు, తదితర అంశాలపైన కూడా ఫోన్‌కాల్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.

మరింత పటిష్టంగా 108, 104 సేవలు...
► 108, 104 లాంటి సర్వీసుల్లో కూడా లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని,  ఆయా వాహనాలపై కూడా ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ ఉంచాలని  సీఎం జగన్‌ ఆదేశం.

కోవిడ్‌పైనా సీఎం వైయస్ జగన్‌ సమీక్ష
► ఏపీలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని వెల్లడించిన అధికారులు.
► అక్కడక్కడా కోవిడ్‌ కేసులు ఉన్నా.. ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య అతిస్వల్పమని తెలిపిన అధికారులు. 
► కేవలం 69 మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నారని, వీరందరూ కూడా కోలుకుంటున్నారని తెలిపిన అధికారులు.
► ఇప్పటికే 87.15శాతం మందికి ప్రికాషన్‌ డోసు వేశామని తెలిపిన అధికారులు.
► ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించినందున.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్న సీఎం జగన్‌. 
► ముఖ్యంగా 60ఏళ్ల పైబడ్డ వారికి ప్రికాషన్‌ డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్న సీఎం. 
► 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి రెండోడోసు 99.69శాతం మందికి ఇచ్చామన్న అధికారులు.
►12 – 14 ఏళ్ల మధ్యనున్న వారికి 98.93 శాతం రెండో డోసు పూర్తిచేశామని తెలిపారు అధికారులు. 

సిబ్బంది నియామకంపైనా సమీక్ష
► ఆస్పత్రుల సామర్థ్యానికి సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకంపైనా సీఎం జగన్‌ రివ్యూ చేపట్టారు. 
► రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 40,476 పోస్టులను ఈ ప్రభుత్వ హయాంలో వచ్చాక భర్తీచేశామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.
► జులై చివరినాటికల్లా సిబ్బంది నియామకాలు పూర్తిచేయాలని ఆదేశం.
► ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ కూడా ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది ఉండాలని అధికారులతో సీఎం వైయ‌స్ జగన్‌.
► ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టీకరణ. 
► ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేంతోనే భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని, దాంట్లో భాగంగానే ప్రమాణాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించడంతోపాటు, నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడం, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని సీఎం జగన్‌, అధికారుల వద్ద ప్రస్తావించారు.
 
వైద్య ఆరోగ్య శాఖలో నాడు – నేడుపై సమీక్ష.
► పనుల్లో ప్రగతిని సీఎం జగన్‌కు వివరించిన అధికారులు.
► 16 మెడికల్‌కాలేజీల్లోని 14 చోట్ల పనులు ప్రారంభమయ్యాయన్న అధికారులు. 
► నర్సీపట్నంలో కూడా ఈనెలాఖరునుంచి పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
► మెడికల్‌ కాలేజీల్లో వీలైనంత త్వరగా తరగతులు నిర్వహించేలా తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని సీఎం ఆదేశం. 

ఈ సమీక్షా సమావేశంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ  వి వినయ్‌ చంద్, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపి కమిషనర్‌ వి వినోద్‌కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌(డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Back to Top