తాడేపల్లి: విశాఖపట్నంలో ఐటీ హై అండ్ స్కిల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు కావాలని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఐటీ పాలసీపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల, వాణిజ్య శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యంతో పాటు, ఐటీ, పరిశ్రమల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. ‘విశాఖలో ఐటీ హై అండ్ స్కిల్డ్ వర్సిటీ ఏర్పాటు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబొటిక్స్ అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. స్వదేశీ, విదేశీ ఐటీ దిగ్గజ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోవాలి. ఐటీ కంపెనీలకు తగిన మానవ వనరులు సిద్ధం కావాలి. ఏటా కనీసం 2 వేల మందికి విశాఖ సంస్థలో శిక్షణఇవ్వాలి. సర్టిఫికెట్లకు అంతర్జాతీయ స్థాయిలోగుర్తింపు రావాలి. ఐటీలో డిమాండ్కు అనుగుణంగా డిగ్రీ లేదా డిప్లమా కోర్సులు ప్రారంభించాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు..