వైయస్ఆర్ జిల్లా: పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో.. అలుపెరగకుండా శ్రమిస్తున్న లింగాల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెండు రోజుల వైయస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పార్నపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద వైయస్ఆర్ లేక్ వ్యూ రెస్టారెంట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లింగాల మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి.. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముందుగా సొంత నియోజకవర్గ ప్రజలపై ఉన్న మమకారం, స్థానిక బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఒకేచోట కలిసిన ఆనందంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. నియోజకవర్గ నాయకులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. "నాన్న చనిపోయాక.. మీరంతా అందించిన సహకారం, మనోధైర్యంతో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచి ఉన్నాను.." అంటూ పులివెందుల సొంత నియోజకవర్గంలోని లింగాల మండల ప్రజలకు ముఖ్యమంత్రి సవినయంగా తెలియజేశారు. ఈ సందర్బంగా పాడా అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు వివరించగా, లింగాల మండలం, పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న మొత్తం అభివృద్ధి పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి వివరించారు. అనంతరం పలువురు నాయకులు.. పలు అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చారు. పలువురు నాయకులు పలు అంశాలపై ముఖ్యమంత్రికి వినతి పత్రాలను అందివ్వడంతో పాటు, నేరుగా ముఖ్యమంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ, ప్రణాళికా ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అందుకు అన్ని వర్గాల ప్రజలు సమ్మతి, సహకారం ఎంతో అవసరం అన్నారు. గ్రామ లోగిళ్ళలోనే.. గ్రామ సచివాలయాల ద్వారా.. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజలకు అందివ్వడం జరుగుతోందన్నారు. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే.. ఎక్కడా వివక్షకు తవివ్వకూడదని సూచించారు. పరిపాలన పారదర్శకంగా సాగినప్పుడే.. ప్రజా వ్యవస్థ పటిష్టంగా సాగుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా.. అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి ఎలాంటి తావులేకుండా.. కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా అలుపెరుగకుండా శ్రమిస్తున్న వైయస్ఆర్ సీపీ నాయకులకు, అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జేసీ సాయికాంత్ వర్మ, శిక్షణా కలెక్టర్ రాహుల్ మీనా, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.