తాడేపల్లి: కరోనా వైరస్ పరీక్షలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎమర్జెన్సీ కేసులు, డెలివరీ కేసులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలన్నారు. కరోనా నివారణ చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 104కు వచ్చే కాల్స్పై వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. ఎవరికీ ఏ సమస్య ఉన్నా 1902కు కాల్ చేయాలని సూచించారు. అదే విధంగా కొత్త మెడికల్ కాలేజీలకు వెంటనే స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. పంట చేతికొచ్చిన తరుణంలో గ్రామాల్లోని రైతులు అగ్రికల్చర్ అసిస్టెంట్ను సంప్రదించాలని, వారి ద్వారా పంటల పరిస్థితులు, ధరల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించవచ్చని సూచించారు. రూ.100కే వివిధ రకాల పండ్లు ఇవ్వటాన్ని కొనసాగించాలన్నారు.