మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్, డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష

 హైఎండ్‌ స్కిల్స్‌ మన పిల్లలకు నేర్పించాలి.

 హైఎండ్‌ స్కిల్స్‌ నేర్పించే కంపెనీలకు, సంస్థలకు పాలసీలో ప్రాధాన్యత ఇవ్వండి.

 భవిష్యత్‌లో ఐటీ రంగానికి మంచి కేంద్రంగా విశాఖ‌ మారుతుంది.

 డిసెంబర్ నాటికి సుమారు 4వేల గ్రామాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ 

రాష్ట్రంలో మూడు కాన్సెప్ట్‌ సిటీలు

అక్టోబ‌ర్‌లో ఎల‌క్ట్రానిక్‌ మాన్యుఫాక్టరింగ్‌ క్లస్టర్లుకు(ఏఎంసీ) ప్రారంభోత్స‌వం

తాడేప‌ల్లి:  మ‌న పిల్ల‌ల‌కు మంచి ఉద్యోగాలు రావ‌డ‌మే ఐటీ పాల‌సీ ప్ర‌ధాన ఉద్దేశం కావాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్న‌తాధికారుల‌కు సూచించారు. ఆ దిశ‌గా మ‌న పిల్లాల్లో హై ఎండ్ స్కిల్స్ నేర్పించాల‌న్నారు. త‌ద్వారా ప్ర‌పంచ స్థాయిలో పోటీప‌డే ప‌రిస్థితి ఉంటుంద‌ని, మంచి ఉద్యోగాలు వ‌స్తాయ‌ని చెప్పారు. ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్, డిజిటల్‌ లైబ్రరీలపై తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. 

ఐటీ కేంద్రం - విశాఖపట్నం
 విశాఖపట్నం అనేది ఉద్యోగాల కల్పనకు ప్రధాన కేంద్రం అవుతుంద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పేర్కొన్నారు.  ప్రభుత్వం కల్పించనున్న మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇవన్నీ కూడా నగరం స్థాయిని మరింతగా పెంచుతాయ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. – భవిష్యత్‌లో ఐటీ రంగానికి మంచి కేంద్రంగా మారుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.  కాలక్రమేణా ఈ అంశాలన్నీ సానుకూలంగా మారి కంపెనీలకు విశాఖ ఒక ఆకర్షణీయ కేంద్రంగా మారుతుంద‌ని చెప్పారు.  నాణ్యమైన విద్యకు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేయాల‌న్నారు.  నాణ్యమైన విద్య వల్ల మంచి ప్రతిభావంతమైన మానవవనరులు లభిస్తాయ‌ని సీఎం వైయ‌స్ జ‌న్ పేర్కొన్నారు. 

హై ఎండ్‌ ఐటీ స్కిల్స్‌ యూనివర్సిటీ
 ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్శిటీని విశాఖపట్నంలో తీసుకురావాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఐటీ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్‌కు డెస్టినేషన్‌గా ఈ యూనివర్శిటీ మారాల‌న్నారు. 

ఐటీ పాలసీ
రాష్ట్రంలో నూత‌న ఐటీ పాల‌సీ తీసుకురావాల‌ని, ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది కూడా ఇన్సెంటివ్‌లు చెల్లిస్తామ‌ని చెప్పారు.  కనీసం ఏడాది పాటు ఒక ఉద్యోగి స్థిరంగా అదే కంపెనీలో పనిచేయాల్సి ఉంటుంద‌న్నారు.  మొదటి ఏడాది పూర్తవగానే ఆ కంపెనీకి ఇన్సెంటివ్‌ల చెల్లింపులు ప్రారంభం అవుతాయ‌న్నారు.  ఈ నిబంధన వల్ల మన పిల్లలకు ఏడాదిపాటు స్థిరమైన ఉపాధి లభిస్తుంది. 
 అంతేకాక నిర్ణీత కాలం పని వల్ల నైపుణ్యం కూడా మెరుగుపడుతుంద‌న్నారు.

డిజిటల్‌  లైబ్రరీలు – వర్క్‌ ఫ్రం హోం:
రాష్ట్రంలో  వర్క్‌ఫ్రం హోం కాన్పెస్ట్‌ను బలోపేతం చేసే చర్యలు తీసుకోవాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు.  గ్రామాలకు మంచి సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద‌న్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు.  అక్కడనుంచే పనిచేసుకునే సదుపాయం ఉంటుంద‌న్నారు.  డిసెంబర్‌ కల్లా సుమారు 4వేల గ్రామాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఇచ్చేలా అధికారులు ముందడుగు వేస్తున్నార‌ని చెప్పారు.  అదే సమయానికి డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని వెల్లడించారు. – ఈ చర్యలతో గ్రామాలనుంచే వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్‌ మరింత బలోపేతం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.  అన్ని గ్రామ పంచాయతీల్లో రెండేళ్లలో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటు పూర్తికావాల‌ని ఆదేశించారు. 

ఐటీ కాన్సెప్ట్‌ సిటీలు
రాష్ట్రంలో ఐటీ కాన్సెప్ట్‌ సిటీలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలిపారు.  విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో కాన్సెప్ట్‌ సిటీలు ఉంటాయ‌న్నారు.  దీనికి అవసరమైన భూములను గుర్తించాల‌న్నారు.  కాన్సెప్ట్‌సిటీల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేయాలి అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్టరింగ్‌ క్లస్టర్లు(ఏఎంసీ)
 కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నిర్మిస్తున్న వైయస్సార్‌ ఈఎంసీ ప్రగతిపై ముఖ్యమంత్రికి వివరాలు అందించిన అధికారులు.  శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వెల్లడి.  అక్టోబరులో ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవం చేయించేలా ఏర్పాటు చేస్తున్నామని ముఖ్య‌మంత్రికి అధికారులు వివ‌రించారు. 

 సమావేశానికి పరిశ్రమలు,వాణిజ్యం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి,  ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్,  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, వైఎస్‌ఆర్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌  క్లస్టర్స్‌(ఈఎంసీ) సీఈఓ ఎం.నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top