క‌లెక్ట‌ర్ల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

అమ‌రావ‌తి: భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు.  వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాలపై బుధ‌వారం సచివాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులను ఆదుకోవడంపై సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.  

వరదలతో ముంపునకు గురైన ప్రతి ఇంటికీ పరిహారం అందాలని, ఎవ్వరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదని సీఎం వైయ‌స్‌ జగన్‌ అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. వరద బాధితులపట్ల ఉదారంగా ఉండటంతోపాటు మానవతా దృక్పథాన్ని చూపించాలని ఆదేశించారు.  

ఎక్కడా లోటు రానీయకుండా చూడండి..
 వరద బాధితులకు 25 కేజీల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ బంగాళదుంపలు ఇవ్వాలి. గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకోవాలి. వలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సహాయం అందాలి. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి ఎక్కడా లోటు రానీయకుండా మంచి సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట వినిపించాలి. అలాగే, ఈ శిబిరాల నుంచి వారు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలి. విద్యుత్, రక్షిత తాగునీటి పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి. విద్యుత్‌ పునరుద్ధరణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదు. సరిపడా సిబ్బందిని తరలించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలి.  

బాధితుల‌కు తోడుగా ఉండాలి..
104 కాల్‌ సెంటర్‌ గురించి ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. వరదలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా.. ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వమని చెప్పండి. ఈ నంబర్‌కు ఎలాంటి సమాచారం వచ్చినా అధికారులు స్పందించి బాధితులకు తోడుగా ఉండాలి. జిల్లాల్లో ‘104’కు ప్రత్యేక అధికారిని నియమించాలి. 
 

ఇల్లు నిర్మించుకునేందుకు  రూ.1,80,000

ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా.. బాధితులకు వెంటనే నగదు ఇవ్వాలి. పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ.95,100 నగదు ఇచ్చి వీరికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయాలి. అలాగే, ఇల్లు నిర్మించుకునేందుకు వీరికి రూ.1,80,000 కూడా ఇవ్వాలి. దీనివల్ల వారు వెంటనే ఇంటి పనులు మొదలుపెట్టగలుగుతారు. అలాగే, పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ.5,200ల నగదు వెంటనే అందించాలి.

పశువులకు దాణా అందించాలి..
పంటల నష్టం ఎన్యూమరేషన్‌ వెంటనే మొదలు పెట్టాలి. రైతులకు 80శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలి. అంతేకాక.. మరణించిన పశువుల కళేబరాలవల్ల వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పశువుల ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలి. పశువులకు దాణా కూడా అందించమని ఆదేశాలు జారీచేశాం. ఇందుకు చర్యలు తీసుకోవాలి. పశువులు మరణిస్తే నష్టపరిహారం ఇవ్వాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు.
 

Back to Top