తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘అభయం’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమలు చేస్తున్నామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆటోలు, క్యాబ్లలో ప్రయాణించే మహిళలకు అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వారు ప్రయాణించే వాహనం ఎక్కడుందో తెలుసుకుని వెంటనే పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన అభయం ప్రాజెక్టు ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. ఈ రోజు మన రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు మన ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేస్తోంది. మనది మహిళా పక్షపాత ప్రభుత్వం. అక్క చెల్లెమ్మలను అన్ని రకాలుగా వారి కాళ్ల మీద వారు నిలబడేలా ఆర్థిక స్వావలంబన కోసం అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ, విద్యా దివేన, వసతి దీవెన పథకాలు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నాం. చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం. అక్క చెల్లెమ్మలను అన్ని కోణాల్లో వారి కాళ్లపై నిలబడే దిశగా అడుగులు వేస్తున్నాం. నామినేషన్ పనులు, పదవులు 50 శాతం మహిళలకు ఇవ్వాలని చట్టం చేశాం. అక్కచెల్లెమ్మలను అన్ని రకాలుగా పైకి తీసుకురావాలని ఆలోచన చేసే ప్రభుత్వం మనది. రాష్ట్ర హోం మంత్రి నా చెల్లెలు కావడం, ఉప ముఖ్యమంత్రి పదవిలో మరో చెల్లెలు ఉండటం రాజకీయంగా అవకాశం కల్పించాం. ఆడవాళ్లు, చెల్లెమ్మలవిషయంలో వారి రక్షణ కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నాం. రక్షణ, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. మహిళల రక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా దిశా చట్టం తెచ్చాం. ఈ రోజు ప్రతి జిల్లాలోనూ దిశ ప్రత్యేక పోలీసు స్టేషన్లు కనిపిస్తున్నాయి. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేశాం. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. దిశా యాప్ కూడా తెచ్చాం. మహిళలు ఎక్కడ ఉన్నా వారికి తోడుగా ఉంటున్నాం. ఈ యాప్ బటన్ నొక్కితే నిమిషాల్లో పోలీసులు తోడుగా నిలబడే విధంగా డివైజ్ రూపొందించాం. ఈ యాప్ ప్రతి చెల్లెమ్మలు, తమ సెల్ పోన్లలో డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రయత్నాలన్నింటికి తోడుగా అభయం అనే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం.దీన్ని యాప్ కూడా అనుకోవచ్చు. దిశ యాప్ పోలీసు శాఖ నిర్వహిస్తుంటే.. అభయం యాప్ రవాణా శాఖ చూస్తుంది. రాష్ట్రంలో ఆడపిల్లలు, మహిళలు నిర్భయంగా ప్రయాణించేందుకు అభయం అనే ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. మన ఆటో, ట్యాక్సీ సోదరులపై నమ్మకం లేక కాదు. ప్రయాణం చేసే వారికి మరింత నమ్మకం పెంచేందుకు ఈ యాప్ తీసుకువస్తున్నాం. మనోధైర్యం ఇచ్చేందుకు ప్రతి ఆటో, ట్యాక్సీలో ఏర్పాటు చేస్తున్నాం. ఆటో ఎక్కిన వారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే..ఎక్కడికి వెళ్తున్నామో తెలిసిపోతుంది. పానిక్ బటన్ నొక్కితే పోలీసులు నేరుగా మీ ప్రాంతానికి వస్తారు. మీకు మనోధైర్యాన్ని ఇస్తారు. మన ఆటోలపై కూడా నమ్మకం పెరుగుతోంది. దశలవారీగా రాష్ట్రంలో లక్షరవాణా వాహనాలకు ట్రాకింగ్ డివైస్లు బిగించి వచ్చే ఏడాది నవంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయాలని రవాణాశాఖ లక్ష్యం పెట్టుకుంది. తొలిదశలో విశాఖపట్టణంలో వెయ్యి ఆటోల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలో అమలు చేస్తారు. ఫిబ్రవరి 1 నాటికి 5 వేల నాటికి , జూలై నాటికి 50 వేలు, నవంబర్ నాటికి లక్ష వాహనాలకు ఈ యాప్ను ఏర్పాటు చేస్తాం. దీని వల్ల ప్రయాణం అన్నది అక్క చెల్లెమ్మలకు సేఫ్గా ఉంటుంది. మన ఆటో డ్రైవర్లకు కూడా మేలు జరుగుతుంది. ఆటోలు, ట్యాక్సీలు ఎక్కడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఓలా, ఉబర్ వంటి సంస్థలే కాదు..మన ఆటోలు కూడా అంతకంటే ఎక్కువ సేఫ్టీ ఇస్తారన్న నమ్మకం కలిగిస్తున్నాం. దీనివల్ల అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.