మ‌హిళ‌ల‌కు అన్యాయం జ‌రిగితే ప్ర‌భుత్వం ఊరుకోదు

దిశ పెట్రోలింగ్‌ వాహనాలు ప్రారంభించిన సీఎం వైయ‌స్ జగన్‌

1.16 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్నారు

అమరావతి:  రాష్ట్రంలో మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చింద‌న్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ మాట్లాడుతూ.. మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. 1.16 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇప్పటికే దిశ పోలీస్‌స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలున్నాయి. వీటితో పాటు 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని సీఎం వైయ‌స్ జగన్‌ అన్నారు. 

ఏదైనా ప్రమాదం జరిగితే  4-5 నిమిషాల్లో అందుబాటులో..
 ఏదైనా ప్రమాదం జరిగితే పట్టణాల్లో 4-5 నిమిషాల్లో, గ్రామాల్లో 8-10 నిమిషాల్లో దిశ సిబ్బంది స్పందించనున్నారు.  ఈ దిశ పెట్రోలింగ్‌ వాహనాలు జీపీఎస్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్‌కి అనుసంధానమై ఉంటాయి. ఇప్పటికే దిశ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 900 ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంచారు. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. దిశ పెట్రోలింగ్‌ వాహనాలకు రూ. 13.85 కోట్లు, రెస్ట్‌ రూమ్స్‌కి రూ. 5.5 కోట్లు ఖర్చు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడం, మహిళలకు పటిష్టమైన భద్రత, క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం, ప్రజలకు మరింత చేరువ కావడం, విజిబుల్‌ పోలీసింగ్‌ను మెరుగుపరచడం కోసం రాష్ట్ర పోలీస్‌ శాఖ దిశ పెట్రోలింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 


 

Back to Top