అవినీతి నిర్మూల‌న‌కు ‘ఏసీబీ 14400’ యాప్‌

యాప్‌ను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అవినీతి లేని పాలన అందించడం మన అందరి కర్తవ్యం

యాప్‌లో ఆడియో, వీడియో ద్వారా సంభాష‌ణ రికార్డు చేసి ఫిర్యాదు చేసే అవ‌కాశం

ఫిర్యాదుల‌ను ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుంది

అవినీతికి పాల్ప‌డుతూ ఎవరైనా పట్టుబడితే.. కఠిన చర్యలు

అధికారుల‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

తాడేప‌ల్లి: అవినీతి నిర్మూల‌న‌కు రూపొందించిన `ఏసీబీ 14400` మొబైల్ యాప్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. గ‌తంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు అధికారులు ఏసీబీ యాప్‌ను త‌యారు చేశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో స్పంద‌న కార్య‌క్ర‌మంపై స‌మీక్షలో భాగంగా `ఏసీబీ 14400 యాప్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. 

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..
ఈ ప్ర‌భుత్వం వచ్చిన నాటినుంచి ఒకటే మాట చెప్తున్నాం, ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట చాలా స్పష్టంగా చెప్పాం. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని ఎలాంటి అవినీతి లేకుండా, వివ‌క్ష‌, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా జ‌మ చేశాం. ఎక్కడైనా, ఎవరైనా కూడా.. కలెక్టరేట్‌ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్‌ అయినా, వలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే.. ఎవరైనా చేయాల్సింది ఒక్కటే.

తమ చేతుల్లోని ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్‌ చేసి.. బటన్‌ ప్రెస్‌చేసి వీడియో ద్వారా కానీ, ఆడియో ద్వారా కానీ సంభాషణను రికార్డు చేయండి.. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది. అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకువస్తున్నాం. ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుంది. ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉంది. అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకితభావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. మన స్థాయిలో అనుకుంటే.. 50శాతం అవినీతి అంతం అవుతుంది. మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. అవినీతి లేని పాలన అందించడం మన అందరి కర్తవ్యం. ఎవరైనా పట్టుబడితే.. కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. 

యాప్‌ ఎలా పనిచేస్తుందంటే..
గూగుల్‌ ప్లే స్టోర్‌లో యాప్ అందుబాటులో ఉంటుంది. యాప్‌ డౌన్లోడ్‌ చేయగానే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ. ఓటీపీ రిజిస్టర్‌ చేయగానే వినియోగానికి యాప్‌ సిద్ధం. యాప్‌లో 2 కీలక ఫీచర్లు ఉంటాయి. యాప్‌ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను  నేరుగా లైవ్‌రిపోర్ట్‌ ఫీచర్‌ను వాడుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం. 

లాడ్జ్‌ కంప్లైంట్‌ ఫీచర్‌ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి.. ఫిర్యాదుకు  తన దగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం. ఫిర్యాదు రిజిస్టర్‌ చేయగానే మొబైల్‌ ఫోన్‌కు రిఫరెన్స్‌ నంబరు. త్వరలో ఐఓఎస్‌ వెర్షన్‌లోనూ యాప్‌ను సిద్ధం చేస్తున్న ఏసీబీ

Back to Top