అమరావతి: ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేలా, నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ప్రతి వినతి పరిష్కారమయ్యే వరకూ ట్రాకింగ్ చేస్తారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను పొందడంలో ఎలాంటి సమస్యలున్నా తెలియచేయవచ్చు. సంక్షేమ పథకాలు, వైయస్ఆర్ పెన్షన్ కానుక, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైతే రైతన్నలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, మరెవరైనా సరే 1902కు ఫోన్ చేసిన వారి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా, ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం ద్వారా పరిష్కారం కోసం 1902 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలి. ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్ధితి, పరిష్కారం గురించి తెలుసుకునే వీలుంది. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లతో పాటు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఎలా చెబుదామంటే..? మీ సమస్యను తెలియచేసేందుకు తొలుత 1902 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయాలి కాల్ సెంటర్ ప్రతినిధికి మీ సమస్యను చెప్పండి మీ ఫిర్యాదును నమోదు చేసుకుని వైయస్ఆర్ (యువర్ సర్వీస్ రిక్వెస్ట్) ఐడీని కేటాయిస్తారు మీ అర్జీ స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా అప్డేట్ అందుతుంది సమస్య పరిష్కారం తర్వాత ప్రభుత్వ సేవలపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి