తాడేపల్లి: రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తోన్న చారిత్రక ద్రోహాన్ని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ జిల్లాల పార్టీ అధ్యక్షులు, కీలక నేతలు సమావేశమై, సీమ ప్రాజెక్టుల రక్షణ కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాధ్ లు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమకు చేస్తున్న అన్యాయాన్ని ప్రతి గ్రామంలోనూ ఎండగట్టాలని నిర్ణయించారు. ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని.. రాయలసీమ హక్కుల కోసం వైయస్ఆర్సీపీ వెనకడుగు వేయబోదని వైయస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. ● భూమన కరుణాకర్ రెడ్డి, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్. - రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం.. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా చంద్రబాబుకు రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ఏనాడూ చిత్తశుద్ధి లేదు. అడుగడుగునా మోసపు మాటలతో సీమ ప్రజలను వంచిస్తున్నారు. దివంగత నేత వైయస్సార్ జలయజ్ఞం ద్వారా పునాది వేస్తే, వైయస్ జగన్ గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 85 వేల క్యూసెక్కులకు పెంచే బృహత్తర పనులకు శ్రీకారం చుట్టారు. కానీ చంద్రబాబు ఆ పనులను పాతాళంలోకి తొక్కివేస్తూ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారు." - సీమ ప్రాజెక్టుల విధ్వంసానికి వ్యతిరేకంగా ఉద్యమం: "తడారిపోతున్న రాయలసీమ పొలాలకు నీళ్లివ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా కూటమి ప్రభుత్వానికి లేదు. కేవలం మభ్యపూరిత చేష్టలతో కాలం గడుపుతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను రూపొందించాం. సాగు, తాగునీటి కోసం నిధులు కేటాయించే వరకు దశలవారీగా రైతుల పక్షాన వైయస్ఆర్సీపీ అలుపెరగని పోరాటం చేస్తుంది." ● అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే. "కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమను కాపాడేందుకు వైయస్సార్ గారు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేయడంతో పాటు హంద్రీనీవా సామర్థ్యాన్ని 11,500 క్యూసెక్కులకు పెంచి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు నీరందించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఈ పనులన్నింటికీ విఘాతం కలిగిస్తూ సీమను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు." ● సాకే శైలజానాధ్, మాజీ మంత్రి. రాయలసీమ ప్రయోజనాలను పక్కనపెట్టి, ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం మౌనం వహిస్తోంది. రాయలసీమను ఎడారిగా మార్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. "శ్రీశైలంలో నీటి మట్టం 800 అడుగులు చేరకముందే తెలంగాణ ప్రభుత్వం రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించుకుపోతుంటే చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. జూరాల, నెట్టంపాడు వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటిని మళ్లిస్తున్నా అడ్డుకోలేక పోవడం ఈ ప్రభుత్వ చేతకానితనం. ఎగువన కర్ణాటక అప్పర్ తుంగభద్ర ద్వారా నీటిని మళ్లించడం వల్ల రాయలసీమకు నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోతోంది." - రాయలసీమ లిఫ్ట్ సీమ పాలిట ఇన్సూరెన్స్ పాలసీ: "వైయస్ జగన్ గారు రాయలసీమ రైతుల హక్కుల కోసం, ఆయుకట్టు స్థిరీకరణ కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (RLS) అనే 'గేమ్ ఛేంజర్' ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది కొత్త ప్రాజెక్టు కాదు, కేవలం మనకు రావలసిన నీటిని తీసుకునే వ్యవస్థ మాత్రమే. జగన్ గారి హయాంలో రూ. 900 కోట్లు ఖర్చు చేసి సివిల్ పనులు పూర్తి చేస్తే, కేవలం మోటార్లు బిగించాల్సిన సమయంలో కూటమి ప్రభుత్వం పనులను నిలిపివేసింది. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై ఈ ప్రాజెక్టును చంద్రబాబు ఆపేయడం సీమ ప్రజలకు చేస్తున్న ద్రోహం." - పోలవరం ఎత్తు తగ్గింపు - 100 టీఎంసీల నష్టం: "పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల వద్ద నిర్మించాల్సి ఉండగా, దానిని 41.15 మీటర్లకు తగ్గిస్తుంటే చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు? ఎత్తు తగ్గిస్తే 100 టీఎంసీల నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి, రాయలసీమకు అందాల్సిన నికర జలాలు అందకుండా పోతాయి. కేంద్రంలో మీకున్న పలుకుబడిని ఉపయోగించి పోలవరం ఎత్తును తగ్గకుండా చూడాల్సిన బాధ్యత మీపై లేదా చంద్రబాబూ?" - అడుగడుగునా సీమకు అన్యాయమే: "రాయలసీమ నుండి ఎయిమ్స్ ను మంగళగిరికి తరలించారు, కడప గ్రామీణ బ్యాంకును లాక్కెళ్లారు, కర్నూలు నుండి హైకోర్టును తరలించే ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. రాయలసీమకు రావాల్సిన ప్రతి అవకాశాన్ని చంద్రబాబు అడ్డుకుంటున్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినప్పుడు వైయస్సార్ గారిని అడ్డుకున్న చంద్రబాబు, నేడు రాయలసీమ లిఫ్ట్ ద్వారా దక్కాల్సిన 22 టీఎంసీల నీటిని 'బురద నీళ్లు' అని అవమానిస్తున్నారు." ఈ నేపధ్యంలో పోలవరం ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ 45.72 మీటర్ల వద్దే కొనసాగేలా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే ప్రారంభించి పూర్తి చేయడంతో పాటు కృష్ణా, తుంగభద్ర నదులపై ఎగువ రాష్ట్రాలు చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై న్యాయపోరాటం చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజల దాహార్తిని, రైతుల ఆకలిని తన రాజకీయ స్వార్థం కోసం పణంగా పెడుతున్న చంద్రబాబు తీరుపై ప్రజలు నిలదీయం ఖాయమని శైలజానాథ్ హెచ్చరించారు.