తాడేపల్లి: రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్ హబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి సహా 16 చోట్ల హెల్త్ హబ్లు ఏర్పాటు చేయాలని, నెల రోజుల్లో ఈ పాలసీని తీసుకురావాలని ఆదేశించారు. ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. హెల్త్ హబ్ల కోసం సేకరించిన భూముల్లో ఒక్కో ఆస్పత్రికి ఐదు ఎకరాలు కేటాయించాలని ఆదేశించారు. మూడేళ్లలో రూ.100 కోట్లు పెట్టుబడులు పెట్టే ఆస్పత్రులకు ఈ భూములు ఇవ్వాలన్నారు. దీని వల్ల కనీసం 80కి పైగా మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు వైద్యం కోసం ప్రజలు ఎందుకు వెళ్లాల్సి వస్తుందో ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్ చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వస్తాయన్నారు. హెల్త్ హబ్స్ పాలసీ వల్ల ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్లలో మల్టీస్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయన్నారు. టెరిషరీ కేర్ మెరుగుపడితే ఇతర ప్రాంతాల్లో వైద్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు మంచి వైద్యం అందుతుందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ తయారయ్యేలా విధానం తీసుకురావాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.