తాడేపల్లి: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్)కు జాతీయ అవార్డు రావడంతో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ అభినందించారు. గురువారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్ వీసీ అండ్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు కలిసి అవార్డు గురించి వివరించారు. గవర్నెన్స్ నౌ అవార్డుకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ప్రభుత్వ రంగ సంస్ధగా ఏపీ సీడ్స్ ప్రత్యేక గుర్తింపు సాధించడాన్ని అభినందించారు. రైతులకు గ్రామస్ధాయిలో నిరాటంకంగా, సకాలంలో విత్తనాలు పంపిణీ చేసి, ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకోవడంపై ఏపీ సీడ్స్ ఎండీని, సిబ్బందిని అభినందించి, మున్ముందు రైతుల కోసం మరింతగా సేవలందించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సీఎం వైయస్ జగన్ సూచించారు.