అమరావతి: రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు అసెంబ్లీ కమిటీ హాల్లో శుక్రవారం ఉదయం రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుఫున రాజ్యసభ బరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని ఉన్నారు. ప్రస్తుతమున్న సంఖ్యాబలాన్ని బట్టీ మొత్తం నాలుగు స్థానాలను అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. వైయస్ఆర్ సీపీ అభ్యర్థుల తరఫున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి పోలింగ్ బూత్లో కూర్చున్నారు. కాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన ఓటును బీసీ వర్గానికి చెందిన వైయస్ఆర్ సీపీ రాజ్యసభ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్కు కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.