నేడు వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

రాత్రి ఇడుపులపాయలో బస 

రేపు ఈసీ గంగిరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం 

వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శని, ఆదివారాలలో జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 3.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3.15 గంటలకు అక్కడి నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 4.20 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు. అక్కడ 4.50 గంటల వరకు పార్టీ నేతలతో మాట్లాడతారు. 5.00 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. 

►3వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 9.50 గంటలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి 9.55 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి తన మామ, దివంగత ఈసీ గంగిరెడ్డి సమాధి వద్దకు చేరుకుని 10.00 గంటలకు సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 10.30 నుంచి 11.30 గంటల వరకు  భాకరాపురంలోని ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 11.35 గంటలకు అక్కడి నుంచి భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు. 12.15 గంటలకు తన నివాసం నుంచి భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.40 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 12.45 గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుంచి బయలుదేరి 1.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి  2.00 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.   

 
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన   
  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి రెండు రోజులపాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్న దృష్ట్యా ఏర్పాట్లను   కలెక్టర్‌ విజయరామరాజు,  ఎస్పీ అన్బురాజన్‌లు పర్యవేక్షించారు. శుక్రవారం వారు పులివెందులలోని భాకరాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను, అలాగే డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న డాక్టర్‌ ఇసీ గంగిరెడ్డి ఘాట్‌ను, భాకరాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు  పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. వైఎస్సార్‌ ఆడిటోరియంలో డాక్టర్‌ ఇసీ గంగిరెడ్డి సంస్మరణ సభకు సీఎం హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.   అలాగే ఘాట్‌ వద్ద సీఎం నివాళులర్పించనున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎవరెవరిని అనుమతించాలి, ఎంతమందిని అనుమతించాలన్న అంశంపై పులివెందుల పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో చర్చించారు. కార్యక్రమంలో పులివెందుల సీఎం కార్యాలయ కో ఆర్డినేటర్‌ జనార్దన్‌రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు, పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, అర్బన్‌ సీఐ భాస్కర్‌రెడ్డి, వేంపల్లె సీఐ వెంకటేశ్వర్లు , తహసీల్దార్‌ మాధవ కృష్ణారెడ్డి, కమిషనర్‌ నరసింహారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ సిద్ధారెడ్డి, డీఈ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

కడప ఎయిర్‌పోర్ట్‌ వద్ద.. 
  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల జిల్లా పర్యటన నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. శుక్రవారం కడప విమానాశ్రయాన్ని సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రాకను పురస్కరించుకుని చేపట్టాల్సిన భద్రతా చర్యలపై దిశా నిర్దేశం చేశారు.  

తాజా వీడియోలు

Back to Top