తాడేపల్లి: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. అనంతరం వైయస్ జగన్కు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే త్యాగానికి, ప్రేమకు ప్రతీకగా నిలిచిన పవిత్ర దినమని, ఈస్టర్ పర్వదినం ఆశ, పునర్జన్మ, విశ్వాసానికి సంకేతమని పేర్కొన్నారు. సమాజంలో ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెంపొందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని క్రైస్తవ సోదర సోదరీమణులకు పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబం ఆనందం, ఆరోగ్యం, సుభిక్షంతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బొల్లవరపు జాన్ వెస్లీ, ఆర్చ్ బిషప్ ఎన్జెఎస్డి రాజు (ఇండియన్ క్రిస్టియన్ మిషన్), బిషప్ సంజీవరావు (బైబిల్ మిషన్), బిషప్ సైమన్ సీజర్ (మెట్రోపాలిటన్ చర్చెస్), ఏసురత్నం (ఆంధ్ర ఇవాంజెలికల్ లూథరన్ చర్చి), బిషప్ అనిల్ (రోమన్ క్యాథలిక్ మిషన్), లెఫ్టినెంట్ కల్నల్ గుర్నమ్ మసిహ్ (సాల్వేషన్ ఆర్మీ), పాల్ ఇమ్మాన్యుయేల్ (యంగ్ హోలి మినిస్ట్రీస్), రెవరెండ్ ప్రసాద్ రెడ్డి (ఫిలడెల్ఫియా బైబిల్ ఇన్స్టిట్యూట్), బిషప్ జాన్ కర్నెల్ (గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీ), బిషప్ గుళ్ళ మార్టిన్ (బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా), బిషప్ ఆశీర్వాదం (గ్రేస్ బాప్టిస్ట్ చర్చెస్), టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.