తాడేపల్లి: "రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా ‘అంతా నేనే చేశాను’ అంటూ సాగిస్తున్న ప్రసంగాలు అత్యంత హాస్యాస్పదంగా మారాయని వైయస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనంతపురంలో పచ్చదనం రావడానికి కూడా తానే కారణమని చెప్పుకోవడం చంద్రబాబు కామెడీకి పరాకాష్ట అని మండిపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించి రాయలసీమ గొంతు కోసిన చరిత్ర చంద్రబాబుది అయితే, అదే ప్రాజెక్టును మళ్ళీ 40 టీఎంసీలకు పెంచి పూర్తి చేసిన ఘనత దివంగత వైయస్సార్దేనని స్పష్టం చేశారు. అమరావతి పేరుతో రూ. 51 వేల కోట్ల అప్పు చేసి, అందులో రూ. 13 వేల కోట్లను కాంట్రాక్టర్ల కమిషన్ల రూపంలో దోచుకుంటున్నారని గణాంకాలతో సహా ఎండగట్టారు. చదరపు అడుగుకు రూ. 4 వేలు అయ్యే నిర్మాణానికి రూ. 16 వేలు కోట్ చేయడం పచ్చి దోపిడీ కాదా అని ప్రశ్నించారు. ఈ అవినీతిపై సమాధానం చెప్పలేకే వైయస్ఆర్సీపీ నేతల కుటుంబ సభ్యులు, మహిళలపై నీచమైన రాతలు రాయిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. హైకోర్టును, లా యూనివర్సిటీని తరలించి రాయలసీమకు ద్రోహం చేసిన చంద్రబాబు, ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఈ దోపిడీపై తాము యుద్ధం కొనసాగిస్తామని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు." ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే.. - హంద్రీనీవా రాజశేఖర రెడ్డి చలువే ... అనంతపురంలో పచ్చదనం రావడానికి తానే కారణమని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. "హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించి రాయలసీమ గొంతు కోసిన వ్యక్తి చంద్రబాబు. ఆ కుదింపు జీవోను రద్దు చేసి, మళ్ళీ 40 టీఎంసీలకు పెంచి, నిధులు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేసింది మహానేత వైయస్సార్. నీ హయాంలో కేవలం బోర్డులు వేసుకోవడం తప్ప ఒక్క రూపాయి ఖర్చు చేశావా బాబూ? ధైర్యం ఉంటే గుండెల మీద చేయి వేసుకుని సమాధానం చెప్పు". రాయలసీమ నేడు హార్టికల్చర్ హబ్గా మారిందంటే అది వైయస్సార్ ఇచ్చిన ఉచిత విద్యుత్, 90 శాతం సబ్సిడీ ఫలితమే. - రాయలసీమ ద్రోహి చంద్రబాబు – పక్క రాష్ట్రాల ఒత్తిడికి తలొగ్గిన వైనం.. చంద్రబాబుకు రాయలసీమ అంటే ద్వేషం. "కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నా, అప్పర్ భద్రా ప్రాజెక్టు కట్టి సీమకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నా చంద్రబాబు నోరు మెదపడం లేదు. రాయలసీమ నుంచి హైకోర్టును, లా యూనివర్సిటీని తరలించి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు. వైయస్.జగన్ దాదాపు పూర్తి చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిడి వల్ల నిలిపివేసి తన సీమ ద్రోహి ముద్రను చంద్రబాబు బలపరుచుకున్నారు". - అమరావతి అంటే దోపిడీ అడ్డా.. రాజధాని అమరావతి పేరుతో రూ. 51 వేల కోట్లు అప్పు చేసి, అందులో రూ. 13 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు, కానీ అందులో ఎక్కువ భాగం లంచాల రూపంలోకే పోయింది. "మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో రూ. 8 వేల కోట్లు ఇచ్చి, అందులో రూ. 6 వేల కోట్లు కమిషన్లుగా వెనకేశారు. చదరపు అడుగుకు నిర్మాణ ఖర్చు రూ. 4 వేలు అయ్యే చోట రూ. 16 వేలు కోట్ చేయడం ఎంత పెద్ద దోపిడీ? కేవలం నాలుగు కంపెనీలకే కాంట్రాక్టులు కట్టబెట్టి 50 శాతం అదనపు లాభాలు ఇస్తున్నారు. మేం అమరావతికి వ్యతిరేకం కాదు, ఈ పేరుతో జరుగుతున్న వేల కోట్ల దోపిడీకి మాత్రమే వ్యతిరేకం". - నయారాయపూర్, నియోం సిటీలే నిదర్శనం – భవిష్యత్తుపై అప్పుల భారం.. ప్రపంచవ్యాప్త పరిణామాలను చంద్రబాబు గమనించడం లేదు. చత్తీస్గఢ్లో గ్రీన్ ఫీల్డ్ సిటీగా కట్టిన ‘నయారాయపూర్’ నేడు నిర్మానుష్యంగా మారింది, సౌదీ అరేబియా కూడా ‘నియోం సిటీ’ కట్టలేక చేతులెత్తేసింది. "కేవలం సచివాలయం కోసం 52 లక్షల చదరపు అడుగుల నిర్మాణం ఎందుకు? దాని నిర్వహణ వ్యయం భవిష్యత్తు తరాలకు భారంగా మారుతుంది. తెలంగాణ సచివాలయం కేవలం 10 లక్షల చదరపు అడుగుల్లో అన్ని హంగులతో పూర్తి చేస్తే, మీరు మాత్రం కమిషన్ల కోసమే భారీ నిర్మాణాలకు పూనుకుంటున్నారు". - వ్యక్తిత్వ హననం – మహిళలపై నీచమైన రాతలు.. వైయస్ఆర్సీపీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. "మా ఇంటి మహిళలపై నీచమైన రాతలు రాయించడం మీ సంస్కృతినా? ఒక పక్క మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటారు, మరోపక్క వారిని కించపరుస్తారు. ఈ నేపధ్యంలో భవిష్యత్ తరాలు నష్టపోకుండా ఉండడానికే మిమ్నల్ని ప్రశ్నిస్తున్నాం. దురదృష్టవశాత్తూ ప్రశ్నించడానికే వచ్చానని చెప్పుకున్న వ్యక్తి పదిహేనేళ్లు మీ పల్లకీ మోస్తా, ఊడిగం చేస్తానని రాజీ పడ్డాడు. మీ మద్ధతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తోందని వాళ్లు కూడా మాట్లాడ్డం లేదు. ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ వైయస్ఆర్సీపీ కాబట్టే మాపై ఈ రకమైన దాడులు చేస్తున్నారు". - కూటమి పాలనలో విధ్వంసం – అపరిష్కృత సమస్యలు.. రాష్ట్రానికి మేలు జరగాలన్న ఉద్దేశ్యంతోనే నాలుగు పోర్టుల నిర్మాణం దాదాపు పూర్తి చేశాం. మూలపేట పోర్టు నిర్మాణం నిలిపివేశారు. బందరు పోర్టు నిర్మాణానికి, దుగిరాజుపట్నం పోర్టు నిర్మాణానికి ఎవరు కారకులు? జువ్వలదిన్నె, నిజాంపట్నం తో పాటు 6-7 ఫిషింగ్ హార్భర్లు దాదాపు పూర్తి చేస్తే వాటినీ పక్కనపెట్టేశారు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని నిలిపివేసి.. మమ్నల్ని విధ్వంసం అంటారా? ఆ రోజు మేం చేస్తున్న అభివృద్ధి పనులన్నింటినీ మీకున్న పలుకుబడితో పదే పదే అడ్డుతగిలిన మాట వాస్తవం కాదా? ఉద్యోగులను, మహిళలను, రైతులను పదే పదే మోసం చేస్తున్నది నువ్వు కాదా చంద్రబాబూ? ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు ఇవ్వలేదు, టీచర్లను రకరకాలుగా హింస్తున్నారు. ఐఆర్ ప్రకటించలేదు. సచివాలయ ఉద్యోగులు మీ హింస వల్ల 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా మీకు జాలి లేదు. మహిళలపై దాడులు నిత్యకృత్యం అయ్యాయి. మీ ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసు లోపల తాళం వేసుకుని 10 గంటలకు పైగా ఐజీ స్థాయి అధికారులు బ్రతిమాలినా తలుపు తీయలేదంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నట్టు? కేవలం మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నాన్ని ఇకనైనా మానుకుని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి. లేని పక్షంలో మరలా ప్రాంతీయ విద్వేషాలకు మీరే తెరలేపినట్లవుతుంది. గతం మరలా పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. మీరు చేస్తున్న పనులను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికైనా మీ దోపిడీకి పుల్ స్టాప్ పెట్టాలని, దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.