టీడీపీకి ఎదురుదెబ్బ‌

 చల్లా రామకృష్ణారెడ్డి వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

హైదరాబాద్‌ : అధికార తెలుగు దేశం పార్టీకి దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతోంది. ఇటీవ‌ల ఇద్ద‌రు ఎంపీలు, ఇద్ద‌రు ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఇటీవ‌ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు కొనసాగుతోంది. కొంతకాలంగా వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నేతలు వైయ‌స్ఆర్‌ సీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ శాసనసభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి వైయ‌స్ఆర్‌  సీపీలో చేరారు. కొద్దిసేప‌టి క్రితం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఆయ‌న పార్టీలో చేరారు. చెల్లాకు కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.  ఐదు దశాబ్దాలుగా జిల్లాలో మంచి పేరుతో పాటు బనగానపల్లెలో ఓటు బ్యాంక్‌ కలిగిన చల్లా నిర్ణయంతో  జిల్లాలో టీడీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.  చల్లా రామకృష్ణారెడ్డి రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం విదితమే.

అలాగే పార్టీ సభ్యత్వాన్ని వదులకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ఫాక్స్‌ ద్వారా లేఖ పంపారు. చల్లా రామకృష్ణారెడ్డి.. 2014 శాసనసభ ఎన్నికల్లో బీసీ జనార్దన్‌రెడ్డి గెలుపునకు కృషి చేసినా, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆయనకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. చెల్లా చేరిక‌ను క‌ర్నూలు జిల్లా పార్టీ నేత‌లు స్వాగ‌తించారు. జిల్లాలోని 14 నియోజ‌క‌వ‌ర్గాలు, రెండు ఎంపీ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగుర‌వేస్తామ‌ని దీమా వ్య‌క్తం చేశారు. కార్య‌క్ర‌మంలో పార్టీ సీనియ‌ర్ నేత‌లు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, కాట‌సాని రామిరెడ్డి, బీవై రామ‌య్య‌, చెల్లా రామ‌కృష్ణారెడ్డి సోద‌రులు పాల్గొన్నారు.

అనంతరం కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీలో ఒడిదుడుకులు భరించలేకనే వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. వైఎస్‌ జగన్‌ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడని ప్రశంసించారు. ఆయన ప్రకటించిన నవరత్నాలు పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు. ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు తాయిలాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఆయన మాయమాటలకు దూరంగా వచ్చినట్టు చెప్పారు.

వైఎస్సార్‌, ఎన్టీఆర్‌ దగ్గర ఎమ్మెల్యేగా పనిచేశానని గుర్తు చేశారు. టీడీపీలో తాను పెద్ద పదవులు అనుభవించలేదని చెప్పారు. సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని బతిమాలితే తీసుకున్నానని వెల్లడించారు. తనకు పెద్ద పదవి ఇస్తానని మూడుసార్లు చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటు పడతానని.. కల్మషం, కపటం లేకుండా పనిచేస్తానని అన్నారు. కర్నూలులో వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేస్తానని, చల్లా మాట ఇస్తే తిరుగేలేదని స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top