కాకినాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనతో ప్రజల మన్ననలు పొందారని, దీంతో టీడీపీ దిక్కుతోచని పరిస్థితిలో పడిందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని టీడీపీకి అర్థమైందన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనుకూల మీడియాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, వైయస్ఆర్ సీపీ మేనిఫెస్టోను విమర్శించేస్థాయికి చంద్రబాబు దిగజారాడన్నారు. ఏడాది పాలనలోనే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను సీఎం వైయస్ జగన్ అమలు చేశారని, మిగిలిన 10 శాతం కూడా ఎప్పుడు పూర్తి చేస్తామో సీఎం వెల్లడించారన్నారు. ఏ నెలలో.. ఏ పథకం అమలు చేస్తామో తేదీల వారీగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేశారని గుర్తుచేశారు. తుని ఆక్వాజోన్లో చంద్రబాబు తన బినామీ కంపెనీలు అయిన దివిస్ పరిశ్రమను తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఆక్వారంగం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆక్వారంగాన్ని సీఎం వైయస్ జగన్ ఆదుకున్నారని, ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర అందించి రైతులకు తోడుగా నిలిచారన్నారు.