మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి విస్తృత ఏర్పాట్లు

 అమరావతి : అమరావతి సచివాలయ ప్రాంగణంలో శనివారం జరగనున్న ఆంధ్ర్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాటు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11.49 గంటలకు మంత్రులు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయం వెలుపల మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ జరుగుతున్న పనులను వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పరిశీలించారు. సభా వేదిక, గ్యాలరీలు, బారి కేడ్లు, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధులు, అతిథులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మరోవైపు మంత్రివర్గ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా అయిదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ తాజాగా తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైయ‌స్ఆర్‌ఎల్పీలో చేసిన ప్రకటన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించనున్నారు. ఇది దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.   

 

Back to Top