తాడేపల్లి: ఆంధ్రరాష్ర్ట తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు దేశం గర్వించదగ్గ నేత అని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కొనియాడారు. ఆంధ్రరాష్ర్ట తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి శాసనసభ్యులు మల్లాది విష్ణు, మాజి మంత్రి డొక్కామాణిక్యవరప్రసాద్, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిలతో పాటు పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రరాష్ర్టానికి ఆయన అందించిన సేవలను నేతలు కొనియాాడారు.
శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ... మహాత్మా గాంధీ స్పూర్తితో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహనీయుడు స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారు అని తెలియచేశారు. న్యాయశాస్ర్త కోవిదుడుగా మద్రాసులో పనిచేసి తాను సంపాదించిన కోట్లువిలువచేసే ఆస్ధినంతటిని స్వాతంత్య్ర పోరాటం కోసం వినియోగించారని వివరించారు. క్విట్ ఇండియా ఉధ్యమం,సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న సమయంలో తెల్లదొరల తుపాకీ గుండ్లకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎదురునిలిచిన మహావ్యక్తి ఆంధ్రకేసరి టంగుటూరి అన్నారు. ఆంధ్రా తొలిముఖ్యమంత్రిగా మార్గదర్శకమైన పాలన అందించారన్నారు.కృష్ణా డెల్టా అభివృధ్దిలో ఆయన పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. అభివృధ్ది, సంక్షేమం విషయంలో ఆయనను మార్గదర్సకంగా తీసుకుని రాష్ర్ట ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారు దేశం గర్వించదగ్గ నేత అని అన్నారు. పేదకుటుంబంలో పుట్టినప్పటికి కష్టపడి పెద్ద చదువులు చదివి ఉన్నతస్దానానికి చేరుకున్నారని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎనలేని కృషి చేసిన దేశభక్తుడు అని అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడే అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనది అని అన్నారు. ప్రకాశం పంతులు ఆలోచనలు, ఆశయాలను స్పూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు పరిపాలన సాగిస్తూ సమాజంలో పేదరిక నిర్మూలన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలియచేశారు.
మాజీ మంత్రి డొక్కామాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ..... స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటీష్ వారిని ఎదిరించడంలో తెలుగువారి వీరత్వాన్ని ప్రదర్సించిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అని తెలియచేశారు.తాను రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి తాను నమ్మిన సిధ్దాంతం కోసం కట్టుబడిన వ్యక్తి అని అన్నారు.విలువలు,నిబధ్దతను చాటిన వ్యక్తిగా కొనియాడారు.దేశాన్ని బానిసత్వంనుంచి విముక్తి కలిగించాలనే మహాత్మాగాంధి పిలుపునందుకుని స్వాతంత్ర్యపోరాటం సాగించారన్నారు.
కార్యక్రమంలో నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి,విద్యార్దివిభాగం రాష్ర్ట అధ్యక్షుడు పానుగంటి చైతన్య,పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ర్ట అద్యక్షుడు కిరణ్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.